విభజనతో ఏపీ సమస్యలు ముందే అధ్యయనం చేశాం: జైట్లీ నోట 'అదే'
విజయవాడ: సమర్థ నాయకత్వం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం నాడు అన్నారు. జైట్లీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు బీజేపీ నిర్వహించిన 'ఆంధ్ర నాదం - ధన్యవాదం' సభలో పాల్గొన్నారు. తొలుత వెంకయ్య మాట్లాడారు.
జైట్లీకి ధన్యవాదాలు: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని కేంద్రమంత్రి వెంకయ్య చెప్పారు. గత నలభై ఏళ్లలో ఏ రాష్ట్రానికి ఇంతగా లబ్ధి చేకూరలేదన్నారు. అంతలా కేంద్రం ఏపీ పైన ప్రత్యక శ్రద్ధ వహించిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అరుణ్ జైట్లీకి మనమంతా థ్యాంక్స్ చెప్పాలన్నారు.
జీఎస్టీ బిల్లు సాకార ఘనత జైట్లీదే అన్నారు. దేశానికి క్లిష్టమైన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారన్నారు. ఏపీకి బిజెపి చెప్పిందేమిటి, చేసిందేమిటో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని వెంకయ్య అన్నారు. ఏపీకి నిరంతర సహకారం కొనసాగుతుందని చెప్పారు.

ఏపీ సమస్యలు ముందే సమీక్షించాం: జైట్లీ
విభజన జరిగితే ఏపీకి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో ముందే అధ్యయనం చేశామని జైట్లీ చెప్పారు.
విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకోవాలని నిర్ణయించామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీ పైన ప్రత్యేక శ్రద్ధ వహించామని చెప్పారు. ఏపీ పుంజుకోవాలంటే ప్యాకేజీ అవసరమని చెప్పారు.
ఏపీలో పరిశ్రమలు, విద్యాసంస్థలు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించామని చెప్పారు. వాటిని పరిగణలోకి తీసుకొని విద్యా సంస్థలు ఇస్తున్నామని అభిప్రాయపడ్డారు. గత రెండున్నరేళ్లలో పలు విద్యా సంస్థలకు శంకుస్థాపన జరిగిందని జైట్లీ చెప్పారు. ఏపీకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు.
వెంకయ్యకు కితాబు
ఏ బాధ్యత అప్పగించినా కేంద్రమంత్రి వెంకయ్య సమర్థవంతంగా నిర్వహిస్తారని కితాబిచ్చారు. వెంకయ్య విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యల పైన అవగాహన పెంచుకున్నారని చెప్పారు.
అవినీతి లేకుండా మోడీ ప్రభుత్వం నడుస్తోంది
గత రెండున్నరేళ్లుగా అవినీతి లేకుండా ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇప్పటికీ అవినీతి గురించి మాట్లాడుకుంటున్నారని, కానీ అది గత ప్రభుత్వ హయాంలోని అవినీతి గురించి అని చెప్పారు. మనం స్ట్రాంగ్ లీడర్ను కలిగి ఉన్నామని ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి అవినీతిని పారదోలామని చెప్పారు.
పాకిస్తాన్ ఇంకా ఉల్లంఘిస్తోంది
పాకిస్తాన్ తన పద్ధతి మార్చుకోవడం లేదని చెప్పారు. అక్కడ తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్నారు. పదేపదే కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. విదేశీ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు.
ఆర్థిక అభివృద్ధిలోని దేశం దూసుకెళ్తోందని చెప్పారు. సమర్థ నాయకత్వం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించారన్నారు. ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ముందుకెళ్తోందన్నారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ నిరంతరం కష్టపడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications