ఏపీ ప్రజల బాధ అర్థమైంది, బాబుతో మాట్లాడా: జైట్లీ, అసలేం మాట్లాడారు!
న్యూఢిల్లీ: తాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడానని, తాము ఏపీ ప్రజల ఆందోళనను అర్థం చేసుకున్నామని, త్వరలో సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడు లోకసభలో ప్రకటించారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ లోకసభలో టిడిపి, వైసిపి ఎంపీలు ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం లంచ్ అనంతరం టిడిపి నేతలు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశం గురించి చర్చించారు.
అనంతరం సభ ప్రారంభమయ్యాక.. వారు ప్రత్యేక హోదాపై హామీ కోసం పట్టుబట్టారు. దీనిపై జైట్లీ స్పందించారు. తాను మీ అధినేతతో (చంద్రబాబు) మాట్లాడానని, త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని ప్రకటించారు.
ఏంకావాలో చూడండి: బాబు ఆగ్రహంతో దిగొచ్చిన మోడీ!, వెంకయ్య చక్రం
టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ... తాము రెండున్నరేళ్లు ఆగామని, ఇంకా ఎంతకాలం ఆగాలని, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
దానికి బీజేపీ సభ్యుడు అనంత్ కుమార్ మాట్లాడుతూ.. జైట్లీ సభాముఖంగా హామీ ఇచ్చారని, కాబట్టి ఆందోళన విరమించాలని కోరారు. అయితే, టిడిపి నేతలు మాత్రం పట్టువిడవలేదు.
దీంతో, మరోసారి అనంత్ కుమార్ కల్పించుకొని.. ఏపీ ప్రయోజనాలను కాపాడుతామని, కానీ కొంత సమయం కావాలన్నారు. ఆందోళనలు విరమించాలని విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబుతో ఏం మాట్లాడారు, పరిష్కారం ఏమిటి?
అటు బీజేపీ లేదా ఇటు టిడిపి ఎక్కడ కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని అంటున్నారు. తాము పరిష్కారం చూపిస్తామని బిజెపి నేతలు చెబుతున్నారని, కానీ ఎలాంటి పరిష్కారమో చెప్పడం లేదంటున్నారు.
అలాగే, తమకు పరిష్కారం కాదని, హోదాపై ప్రకటన చేయాలని సభ్యులు కూడా డిమాండ్ చేయలేదని అంటున్నారు. అసలు చంద్రబాబుతో ఏం మాట్లాడారు, సమస్యకు పరిష్కారం ఏమిటనే విషయం వారి మధ్య చర్చ జరిగిందా అనే చర్చ సాగుతోంది.