చంద్రబాబుతో తెగదెంపులు: జగన్వైపు బిజెపి చూపు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తుల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో బిజెపి కేంద్ర నాయకత్వం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వైపు చూస్తున్నట్లు సమాచారం. సీట్ల పంపకాల విషయంలో తెలుగుదేశం, బిజెపిల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తాహతుకు మించి బిజెపి సీట్లు అడుగుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అంటున్నారు.
సీమాంధ్రలో తక్కువ సీట్లతో సంతృప్తి చెందడానికి బిజెపి సిద్ధంగా ఉంది. సీమాంధ్రలోని 25 లోకసభ స్థానాల్లో నాలుగు స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో 25 సీట్లు ఇస్తే తమకు సరేనని సీమాంధ్ర బిజెపి అధ్యక్షుడు హరిబాబు అంటున్నారు. కానీ, విశాఖపట్నం, విజయవాడ సీట్లను బిజెపి అడుగుతోంది. ఆ సీట్లను ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఏ మాత్రం సిద్ధంగా లేదు.
కాగా, తెలంగాణలో మాత్రం భారీగా సీట్లు ఇవ్వాలని బిజెపి పట్టుబడుతోంది. తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో పది స్థానాలు, 118 శాసనసభా స్థానాల్లో 60 స్థానాలు ఇవ్వాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అడుగుతున్నారు. దానికి తోడు, మల్కాజిగిరి లోకసభ స్థానం తమకే కావాలని పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీ బిజెపి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉంది. బిజెపి సొంతంగా ఒక్క సీటైనా గెలుచుకోగలదా అని ప్రశ్నిస్తోంది.
బిజెపి, తెలుగుదేశం, జనసేన, లోకసత్తాలతో కలిసి రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో మహా కూటమి ఏర్పడుతుందని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ చర్చలు కొలిక్కి రాకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి తోడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశంపై ఓ రాయి విసిరారు. తాము బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తాం గానీ తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేసేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ స్థితిలో బిజెపి వైయస్సార్ కాంగ్రెసుతో జత కట్టడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. కేంద్రంలో బిజెపితో సహా ఏ పార్టీతోనైనా తాము జత కట్టడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలో బిజెపికైనా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వైయస్ జగన్ చెప్పారు. దీంతో జగన్ను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి నాయకులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అయితే, జగన్తో ఎన్నికలకు ముందు పొత్తు సాధ్యం కాకపోవచ్చునని అంటున్నారు. ఎన్నికల తర్వాత జగన్ను ఎన్డియెలో చేర్చుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు సమాచారం.