కృత్తివెన్ను సమీపంలో తీరం దాటిన అసని తుఫాను: తీవ్ర వాయుగుండంగా, భారీ వర్షాలు, రెడ్ అలర్ట్
అమరావతి: ఏపీకి తుఫాను పెనుముప్పు తప్పినట్లే. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరాన్ని దాటింది. ఇక్కడ భూభాగాన్ని తాకిన అనంతరం బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇది ఈశాన్య దిశగా కదులుతున్నట్లు తెలిపారు.
మచిలీపట్నం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ నర్సాపురం, పాలకొల్లు, అమలాపురం, యానాం, కాకినాడ మీదుగా మళ్లీ సముద్రంలోకి వచ్చే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
వాయుగుండం కదులుతున్న ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు కోస్తాంధ్ర తీరప్రాంతంలో ఇప్పటికే ప్రకటించిన రెడ్ అలెర్ట్ను అధికారులు కొనసాగిస్తున్నారు. మచిలీట్నం, విశాఖ, నిజాంపట్నం, కాకినాడ, భీమిలి, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో జారీ చేసిన 7 నెంబరు ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగిస్తున్నారు. కాగా, తీవ్ర వాయుగుండం ప్రభావంతో గురువారం కూడా ఏపీలో భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
కాగా, అంతకుముందు తుపాను తీరందాటే విషయంపై అస్పష్టత కొనసాగింది. పలు మార్లు దిశ మార్చుకుంటూ తీరం వైపు ప్రయాణించింది అసని. నరసాపురానికి దగ్గరలో తీరం దాటుతుందని ఓసారి, కోనసీమ అంతర్వేది వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉందని మరోసారి ఇలా అంచనాలు వచ్చాయి. మొత్తానికి పలు మలుపులు తిరిగిన తుపాను.. చివరకు కృష్ణా జిల్లా కృత్తివెన్ను సమీపంలో తీరం దాటింది. ఇప్పటికే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించారు. ఎన్డీఆర్ఎస్ సహా పోలీసులు, అధికారులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాంట్రోల్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు.