ఎపికి ప్రత్యేక హోదా: సిఎంలను నిందించిన అశోక్
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగుతుందని కేంద్రం మంత్రి ఆశోక గజపతి రాజు అన్నారు. శుక్రవారం నాడు విశాఖ లైబ్రరీలో సెంటర్ ఫర్ పాలసీస్ స్టడీస్ థర్డ్ సెషన్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం అంగీకరించడం లేదని, మరికొంతమంది ముఖ్యమంత్రులు కూడా ఇందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
విభజనానంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో కాంగ్రెస్ పార్టీయే అడ్డంకులు సృష్టిస్తోందని కూడా ఆయన అననారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం విశాఖ వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. కర్నాటక సహా పలు రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇస్తే తమకు సైతం ఇవ్వాలన్న డిమాండ్ను కొన్ని రాష్ట్రాలు తెరపైకి తెస్తున్నాయని, దీంతో కేంద్రం డోలాయమానంలో పడిందన్నారు.
కాంగ్రెసు అధికారంలో కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమకూ ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబడుతున్నారన్నారు. విభజన సందర్భంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ప్రత్యేక హోదా అన్న అంశం విభజన చట్టంలో లేదని తెలిపారు. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆర్థిక లోటు భారంతో సతమతమవుతోందన్నారు. దాంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుందన్నారు.
ఆంధ్రకు ప్రత్యేక హోదాపై రెండు సార్లు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తమ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను నిలువరించట్లేదని ఆరోపించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతిని పాటిస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ సహా బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఆర్థికలోటుతో ఇబ్బంది పడుతున్నాయని, పరిశ్రమ స్థాపనతో పాటు పలు అంశాల్లో ఈ రాష్ట్రాలను ఆదుకోవాల్సి ఉందన్నారు. దీనికి కేంద్రం సైతం సానుకూలంగానే ఉందని తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం పోరాడుతూనే రాష్ట్రానికి అత్యధిక నిధులు తెచ్చుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందనని తెలిపారు. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. త్వరలోనే రైల్వేజోన్పై సానుకూల ప్రకటన రానుందన్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో రైతులు అనవసర అపోహలు పెట్టుకోవద్దన్నారు. అభివృద్ధి కోణంలో చూస్తే ఎయిర్పోర్టు ఎంతో అవసరమని అన్నారు.
పరిష్కారమవుతుందన్న వెంకయ్య
అదలావుంటే, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై త్వరలో పరిష్కారం జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జమిందార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన బిజేపీ కార్యకర్తల సమావేశంలో ఆ విషయం చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల కారణంగా పోలవరం ప్రాజెక్టు సంక్లిష్టంగా మారిందన్నారు. అయినప్పటకీ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులను కేంద్ర మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు.విభజన చట్టంలో పేర్కొన్నవన్నీ తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి దూరదృష్టి లేదన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారే తప్ప, అభివృద్ధి శూన్యమన్నారు. ఐఐటీ, నిట్, ఎయిమ్స్ వంటి సంస్థలకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు.