అమ్మవారి పండుగతో రాజకీయాలు చెయ్యొద్దు.. ఆ మంత్రి భాషకు దణ్ణం పెట్టాలన్న అశోక్ గజపతి రాజు
కేంద్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాన్సాస్ మరియు సింహాచలం ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవం సందర్భంగా దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు,కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమయంలో ఆయన ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధ కళాకారుల ప్రదర్శనలతో ఊరేగింపుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు
విజయనగరం జిల్లాలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాజా కోట నుండి యుద్ధ కళాకారుల ప్రదర్శనలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇవాళ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అశోక్ గజపతి రాజు పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లికి ఏటా పట్టువస్త్రాలు సమర్పించటం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈ ఏడాది కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు.
ప్రోటోకాల్ పేరుతో భక్తులకు పైడితల్లి అమ్మవారి దర్శనం దూరం చెయ్యొద్దన్న అశోక్ గజపతి రాజు
అనంతరం మాట్లాడిన ఆయన ప్రోటోకాల్ పేరుతో సాధారణ భక్తులకు పైడితల్లి అమ్మవారి దర్శనాన్ని దూరం చేయొద్దని ఆయన పేర్కొన్నారు. అమ్మ వారి పండుగతో రాజకీయం చేయొద్దు అంటూ అధికారులను ఉద్దేశించి అశోక్ గజపతి రాజు హితవు పలికారు. అందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ అమ్మవారిని దర్శించు కోవాలి అని ఆయన పేర్కొన్నారు. కరోనాకు మతాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవించవలసిన అవసరం ఉందని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. అన్ని మతాల వారు మిగతా మతాల వారి పండుగలకు సహకరించాలని అశోక్ గజపతి రాజు విజ్ఞప్తి చేశారు.
ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందే
ఉచిత దర్శనం అందరికీ అందుబాటులో ఉండాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్న కారణంగానే తనను ఆలయ ధర్మకర్త పదవి నుంచి ప్రభుత్వం తొలగించింది అని పేర్కొన్న అశోక్ గజపతిరాజు కోర్టు ద్వారా తాను న్యాయం పొందగలిగానని స్పష్టం చేశారు. ఇక తనను ఆలయ ధర్మకర్త పదవి నుంచి తొలగించిన సమయంలో ఓ మంత్రి గారు వాడిన భాషకు దణ్ణం పెట్టాలంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు.
ఘనంగా జరుగుతున్న తొలేళ్ళ ఉత్సవం .. సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం
ఇదిలా ఉంటే కోరి కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలిచి కోర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా తొలేళ్ళ ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు . అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీనిని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను చేసి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
ఇక నేడు రేపు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్ లైన్ లో సచివాలయ వ్యవస్థ ద్వారా అమ్మవారి దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు. జాతర రెండు రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉండడం వల్ల సచివాలయాల్లో టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లుగా వెల్లడించారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి జాతరను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు.