మోడీలాంటి ప్రధానిని చూడలేదు: అశోక్ గజపతిరాజు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రను కకావికలం చేసిన హుధుద్ తీవ్ర పెను తుఫాను కలిగించిన నష్టాన్ని చూడటానికి స్వయంగా ప్రధానే వచ్చారని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తుఫాను నష్టంపై సమీక్ష నిర్వహించి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఒక ప్రధాని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సమీక్షించటాన్ని మొదటిసారి చూశానని ఆయన చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత సమన్వయంతో పనిచేశాయని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరో మోటార్స్ లిమిటెడ్ కోటి రూపాయల చెక్కును అందచేసిందని ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరినట్లు చెప్పారు.
విజయవాడలో సూపర్ స్పెషాలిటీ ఇఎస్ఐ ఆసుపత్రి
ఆంధ్రప్రదేశ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజయవాడలో ఇఎస్ఐ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ కన్వీనర్ జాస్తి వీరాంజనేయులు కేంద్రానికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం కేంద్ర కార్మిక మంత్రి తోమర్ను కలసి ఆయన ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరారు.
అవిభక్త అంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మాత్రమే ఇఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా సేవలు అందిస్తోందని ఆయన చెప్పారు. విజయవాడలో కొత్తగా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆంజనేయులు తెలిపారు.












Click it and Unblock the Notifications