అశోక్ కౌంటర్ అటాక్ షురూ-ఇక సంచైతకు చుక్కలే- వైసీపీ సర్కార్ను లాగుతూ
విజయనగరం జిల్లాలోని పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చోటు చేసుకున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తామని పదే పదే చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం ముందడుగు వేయడం లేదు. అదే సమయంలో అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామంటూ మంత్రులు, వైసీపీ నేతలు రెచ్చిపోయి ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అశోక్ గజపతిరాజు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు.
రసకందాయంలో మాన్సాస్ రాజకీయం
విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టులో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం చెలాయించిన అశోక్ గజపతిరాజును గతేడాది వైసీపీ ప్రభుత్వం పదవీచ్యుతుడిని చేసి ఆయన అన్నకూతురు సంచైతను తెరపైకి తెచ్చింది. అయితే దాదాపు ఏడాదిన్నర కాలంలో తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకున్న సంచైత.. తాజాగా హైకోర్టు తీర్పుతో మాజీ అయిపోయారు. అంతే కాదు మౌనంగా కూడా ఉండిపోతున్నారు. దీంతో మాన్సాస్ రాజకీయం కాస్తా ప్రభుత్వం వర్సెస్ అశోక్ గజపతిరాజుగా మారిపోయింది. హైకోర్టు తీర్పుతో మాన్సాస్ ట్రస్టు బాధ్యతలు చేపట్టిన అశోక్పై వైసీపీ పెద్దలు రోజుకో విధంగా విమర్శలు, బెదిరింపులు, హెచ్చరికలతో రెచ్చిపోతున్నారు. దీంతో అశోక్ కూడా తాజాగా కౌంటర్ అటాక్ ప్రారంభించారు.
సంచైత స్ధానంలో జగన్ సర్కార్
గతంలో అశోక్ గజపతిరాజును పదవీచ్యుతుడిని చేశాక ఆయన స్ధానంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్గా నియమించిన సంచైత గజపతిరాజు బాబాయ్పై విమర్శలు చేసేవారు. గతంలో అశోక్ తీసుకున్న నిర్ణయాలు తప్పుబడుతూ రోజూ సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లు పెట్టేవారు. కానీ తాజా హైకోర్టు తీర్పుతో సంచైత మాజీ కావడంతో పాటు మౌనంగా ఉండిపోతున్నారు. దీంతో విధిలేని పరిస్ధితుల్లో ప్రభుత్వ పెద్దలు సంచైత స్ధానంలో అశోక్పై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆయన్ను జైలుకు పంపుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సంచైత రాకముందు అశోక్పై విమర్శలు చేసేందుకే భయపడిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఆమె వారసత్వాన్ని అందుకుని సంచైత లేని లోటును భర్తీ చేస్తున్నారు.
కౌంటర్ అటాక్ మొదలుపెట్టిన అశోక్
హైకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చినా ధిక్కరించి సహాయనిరాకరణ చేస్తున్న ప్రభుత్వ పెద్దల తీరుపై అసహనంగా ఉన్న అశోక్ గజపతిరాజు తనపై రోజూ ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న విమర్శలపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారు. కానీ తాజాగా అశోక్ గజపతిరాజు కౌంటర్ అటాక్ మొదలుపెట్టేశారు. ముఖ్యంగా సంచైత హయాంలో తీసుకున్న నిర్ణయాల్ని టార్గెట్ చేస్తూ ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాజాగా పెట్టిన ట్వీట్లో అశోక్.. సంచైత హయాంలో మాన్సాస్ తరఫున ఇచ్చిన ఇసుక తవ్వకాల అనుమతుల్ని ప్రశ్నించారు. తద్వారా ప్రభుత్వాన్నీ ఇరుకునపెడుతున్నారు.
Recommended Video
అశోక్పై విమర్శలా ? మండిపడుతున్న జనం
పూసపాటి రాజవంశీకుడైన అశోక్ గజపతిరాజును దొంగగా చిత్రీకరిస్తూ, ఆయన కుటుంబానికి చెందిన ట్రస్టు భూముల్ని ఆయనే కాజేశారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా రాజకీయం తెలియని అశోక్పై వైసీపీ నేతల విమర్శలు రోత పుట్టించేలా ఉన్నాయని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూసపాటి వంశీయుల ఆధ్వర్యంలో ఉన్న ట్రస్టులు, భూముల్ని వారే కాజేశారంటూ వైసీపీ నేతలు విమర్సించడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయాలతో పాటు ట్రస్టు వ్యవహారాలు, రాజవంశం వ్యవహారాల్లోనూ మర్యాదస్తుడిగా పేరున్న అశోక్పై వైసీపీ నేతల చౌకబారు విమర్శలు సరికాదనే అభిప్రాయం స్ధానికంగా వ్యక్తమవుతోంది.