ఆంధ్రా చేపలా?...వద్దు బాబోయ్:పలు రాష్ట్రాల ఆంక్షలు...ఎందుకంటే?
అమరావతి:ఆంధ్రప్రదేశ్ చేపలంటేనే వద్దంటే వద్దని పలు రాష్ట్రాలు కఠినమైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పెంచే చేపలు తింటే క్యాన్సర్ రావడం ఖాయమని అసోం ప్రభుత్వం ఇప్పటికే మన రాష్ట్రం నుంచి చేపల ఎగుమతులను నిలిపివేసింది.
ఇప్పుడు ఇదే బాటలో వివిధ రాష్ట్రాలు పయనిస్తున్నాయి. కేరళ, కర్ణాటక, నాగాలాండ్ ఇప్పటికే మన రాష్ట్రం నుంచి చేపలను దిగుమతి చేసుకోవడం నిలిపివేయగా తాజాగా అసోం ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. ఈనెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ చేపలను అసోం నిషేధించింది. మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే చేపల్లో క్యాన్సర్ కు కారణమయ్యే ఫార్మాలిన్ రసాయనం ఎక్కువ మోతాదులో ఉండటమే ఈ నిషేధానికి కారణం.

శవాలను కుళ్లిపోకుండా చూసేందుకు గాను ఈ ఫార్మాలిన్ ను వినియోగిస్తారు. అయితే ఎపి నుంచి ఎగుమతి చేసే చేపల్లో ఈ ఫార్మాలిన్ అవశేషాలు చాలా పెద్ద మొత్తంలో ఉండటంపై అన్ని రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఈ విషయమై మన చేపలపై అసోం ప్రభుత్వం జరిపిన రసాయనిక పరీక్షల్లోనూ ఫార్మాలిన్ మోతాదు మించి అధికంగా ఉన్న విషయం స్పష్టమైందట.
అసోంలో చేపల వినియోగం అధికంగా ఉంటుంది. అందువల్ల వారు తమ ఆహార అవసరాల కోసం ఎపి నుంచి పెద్ద మొత్తంలోనే చేపలను దిగుమతి చేసుకుంటారు. అయితే ఎపి ఫార్మాలిన్ మోతాదుల గురించి ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా అసోం కూడా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే నిషేధం ఒక వారం రోజుల పాటేనని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చేపలపై మరోసారి రసాయనిక పరీక్షలు జరిపి ఈ నిషేధం కొనసాగించాలా వద్దా నిర్ణయిస్తామని అసోం ఆరోగ్య శాఖ మంత్రి పిజూష్ హజారికా వెల్లడించారు. నాగాలాండ్ కూడా మన రాష్ట్రం నుంచి పోయే చేపలను గత నెల 22 నుంచి నిషేధించింది. మిజోరాంలో కూడా ఈ చేపలపై జరిపిన పరిశోధనలో ఫార్మాలిన్ ఎక్కువ మోతాదులో వాడుతున్నట్టు తేలింది.
కేరళనుంచి వచ్చే చేపలపై మొదట్లో నిషేధం విధించినా, ఆ తరువాత గత 10రోజులుగా కేరళ చేపల్లో ఫార్మాలిన్ శాతం బాగా తగ్గిందని అందువల్ల కేరళ నుంచి వచ్చే చేపల్ని అనుమతించాలని ఆయా రాష్ట్రాల్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే కేరళ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ చేపల్ని ఫార్మాలిన్ మోతాదు పై అభ్యంతరంతో వెనక్కు పంపించేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications