టీ బిల్లు: అసెంబ్లీలో చర్చ ప్రారంభమైందా, లేదా?
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభమైందా, కాలేదా అనే విషయంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. చర్చ ప్రారంభమైందని తెలంగాణ మంత్రులు చెబుతుండగా, కాలేదని సీమాంధ్ర మంత్రులు అంటున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చర్చను ప్రారంభించాలని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కను కోరారు. ఆ సమయంలో మాట్లాడాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని కోరారు.
అయితే, చర్చపై ఏం చేద్దామని మాత్రమే మాత్రమే డిప్యూటీ స్పీకర్ ఫ్లోర లీడర్ల అభిప్రాయం కోరారు. అందులో భాగంగానే చంద్రబాబును అభిప్రాయం చెప్పాలని అడిగారని అంటున్నారు. అయితే, తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని సచివాలయ కార్యదర్శి సదారాం అన్నారు. అయితే, మరోసారి రికార్డులు పరిశీలించాలని ఆయన అన్నారు.
తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ ప్రారంభం కాలేదని సీమాంధ్రకు చెందిన సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చర్చ విషయంపై డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్ష నేత అభిప్రాయం అడిగారని ఆయన అన్నారు.
బిఎసి సమావేశం తర్వాతనే బిల్లుపై చర్చించాలని సీమాంధ్ర శానససభ్యులు అంటున్నారు. చర్చ ప్రారంభమైందని, మళ్లీ బిఎసి సమావేశం అవసరం లేదని తెలంగాణ శాసనసభ్యులు అంటున్నారు. సభలో మూవ్ చేయకుండా బిల్లుపై చర్చ సాధ్యం కాదని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ అన్నారు.