అనంతలో 'తెప్ప' విషాదం: తల్లడిల్లిన గుండెలు, 14మంది మృతి(ఫోటోలు)
చెరువు మధ్యలో గట్టు ఉండటంతో వారిని అక్కడ దించి.. మిగతా వాళ్లను ఎక్కించుకునేందుకు మళ్లీ ఒడ్డుకు వచ్చాడు. అలా వారిని కూడా ఎక్కించుకుని చెరువు మధ్యలోని గట్టు వద్దకు వెళ్లాక..
అనంతపురం: అనంతలో మరోసారి విషాదం కబళించింది. జలవిహారం కాస్త అంతులేని వేదనను మిగిల్చింది. చిన్నారుల నుంచి ముప్పై ఏళ్ల యువతీ యువకుల దాకా మొత్తం 14మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో వేడుక కోసం ముస్తాబైన ఇంట్లో విషాదపు ఛాయలు నెలకొన్నాయి.
అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎర్రతిమ్మరాజు(వైటీ) చెరువులో శుక్రవారం సాయంత్రం 5గం. సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెప్ప బోల్తా కొట్టడంతో అందులో ఉన్న 17మంది గల్లంతవగా.. 14మంది చనిపోయారు.
ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన సందర్భంగా:
వైటీ చెరువు (ఎర్రతిమ్మరాజు చెరువు) గ్రామంలో శనివారం రామాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభన ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపట్టారు. ఊరంతా వేడుక చేసుకుంటుండటంతో... గ్రామంలోని ప్రతీ కుటుంబం.. తమ బంధుమిత్రులను ఇంటికి పిలిపించుకున్నారు.
బోయ రామన్న బంధువులు:
గ్రామానికి చెందిన బోయ రామన్న కుటుంబం కూడా తమ బంధువులను వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో రామన్న ఇంటికి భారీగానే బంధువులు తరలివచ్చారు. బంధుమిత్రుల్లో కొంతమంది కాలక్షేపం కోసం మధ్యాహ్నాం 2.30గం.కు వైటీ చెరువు వద్దకు వెళ్లారు.
వైటీ చెరువు హంద్రీనీవా నీటితో నిండుగా ఉంది. రామన్న బంధువులు అక్కడికి వెళ్లిన సమయంలో కొంతమంది జాలరులు పుట్టి అని పిలిచే తెప్ప పడవల్లో చేపలు పడుతున్నారు.
పుట్టిలో ఎక్కడమే ప్రమాదానికి కారణమా?:
సాధారణంగా చేపలు పట్టడం కోసం మాత్రమే పుట్టిలను ఉపయోగిస్తుంటారు. ఇందులో ఎక్కువ మంది కూర్చోవడానికి కూడా అవకాశం ఉండదు. అయితే రామన్న బంధువుల కోరిక మేరకు రామయ్య కొడుకు.. ఒక పుట్టిలో కొంతమందిని ఎక్కించుకున్నాడు. వారంతా అవతలి గట్టు వైపు ఉన్న లింగమయ్య గుట్టలోని పురాతన ఆలయాన్ని చూడాలనుకున్నారు.
గట్టుపై కొంతమందిని దింపి:
చెరువు మధ్యలో గట్టు ఉండటంతో వారిని అక్కడ దించి.. మిగతా వాళ్లను ఎక్కించుకునేందుకు మళ్లీ ఒడ్డుకు వచ్చాడు. అలా వారిని కూడా ఎక్కించుకుని చెరువు మధ్యలోని గట్టు వద్దకు వెళ్లాక.. అక్కడున్నవారు కూడా తిరిగి పుట్టిలో ఎక్కారు.
అదుపు తప్పి మునిగిపోయి:
చెరువు గట్టు మీద ఉన్న వారిని కూడా ఎక్కించుకుని బయల్దేరిని కొద్దిసేపటికే.. పుట్టి అదుపు తప్పి నీటిలో మునిగిపోయింది. దీంతో 14మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎర్రమ్మ(30, జంచర్ల), స్పందన (6, జంచర్ల), సుధాకర్ (4, గుంతకల్లు), లక్ష్మి (14, వైటీ చెరువు), లావణ్య (14, పెంచలపాడు), దుర్గ (పెంచలపాడు), లలిత (20, పెంచలపాడు), నితిన కుమార్ (గుంతకల్లు), నేత్ర (6, పెంచలపాడు), అనంతలక్ష్మి (35, గుంతకల్లు), బన్ని (7, గుంతకల్లు), భవాని (13, గుంతకల్లు), గోకుల్ (3) ఉన్నారు.
చీకటి, గాలివానతో గాలింపు నిలివేత:
పుట్టి మునిగిన సమాచారం తెలియగానే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే చీకటి పడటం, గాలివాన రావడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. మృతుల్లో తన మనువలు ఇద్దరు ఉండటంతో.. గ్రామానికి చెందిన చంద్రప్ప(38) అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడం గమనార్హం.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి:
వైటీ చెరువు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనాస్థలంలోనే ఉండి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ఎస్పీ రాజశేఖర్బాబును ఆదేశించారు.
ముందే అనుకున్నారు:
తెప్పలో ఎక్కువమంది ఎక్కడంతో బోల్తా పడుతుందేమోనని అనుమానించారు. అయితే చిన్నపిల్లలు కూడా ఉండటంతో.. తెప్పపై అంత బరువు పడదేమోనన్న ధీమాతో తిరుగు పయనమయ్యారు. కానీ కొద్ది దూరం వెళ్లగానే తెప్ప బోల్తా కొట్టింది. తెప్ప నడిపిన బెస్త రాజు సుమిత్ర(7) అనే చిన్నారిని ఒడ్డుకు చేర్చాడు. మరో బోయరాజు అనే యువకుడు కూడా ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. మిగతవారు అప్పటికే గల్లంతయ్యారు.