టీఆర్ఎస్కు అటార్నీ షాక్: హైద్రాబాద్లో సెక్షన్ 8కు యనమల డిమాండ్
న్యూఢిల్లీ: ఓటుకు నోటు, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంశాల పైన టీఆర్ఎస్కు షాక్ తగలగా, ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు. హైదరాబాద్ పైన ఏపీ ప్రభుత్వానికి హక్కు లేదని, అది చెల్లదని తెరాస నాయకులు చెబుతున్నారు!
అయితే, అటార్నీ జనరల్ అందుకు విరుద్ధంగా స్పందించింది. ఓటుకు నోటు కేసులో గవర్నర్ నరసింహన్ అటార్నీ జనరల్ సలహా కోరారు. దీనిపై అటార్నీ జనరల్ స్పందించింది. పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పైన ఇరు రాష్ట్రాల పోలీసులకు జ్యూరిడిక్షన్ ఉంటుందని చెప్పింది.
దీంతో, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. సెక్షన్ 8 వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధాని అయినందున హైదరాబాదులో ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులు ఉంటాయని చెప్పారు.
అటార్నీ జనరల్ కూడా అదే అంశాన్ని స్పష్టం చేసిందని చెప్పారు. ఇప్పటికైనా సెక్షన్ 8 సమగ్రంగా అమలు చేయాలని కోరారు. హైదరాబాదులో శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యత గవర్నర్దేనని చెప్పారు. అటార్నీ జనరల్ అంశాన్ని ఏపీ టీడీపీ అందిపుచ్చుకుంటోంది.
కాగా, హైదరాబాదులో ఏపీ పోలీసు స్టేషన్లు పెట్టుకునే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సెక్షన్ 8 అమలు అయితే కేంద్రం పైన న్యాయపోరాటం చేస్తామని తెరాస నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే.