బీసీ మంత్రులు నోరులేని మూగజీవాలు; జగన్ చెప్పలేదని నిరూపిస్తే ఉరేసుకుంటా: అచ్చెన్నాయుడు సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 1,116 అక్రమాల పేరుతో ఛార్జిషీట్ విడుదల చేశారు. ఏపీలో విధ్వంసకర, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తుందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రివర్స్ టెండరింగ్ తిరోగమనంలోకి వైసీపీ సర్కార్ నెట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

జగన్ పాలనలో బీసీ మంత్రులు నోరు లేని మూగజీవాలు
జగన్ సర్కారు పాలనలో బీసీ మంత్రులు నోరులేని మూగజీవాలుగా మిగిలిపోయారు అంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పేరుకే వారు మంత్రులని, పెత్తనం అంతా సాయి రెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డిల చేతిలో ఉందని పేర్కొన్నారు. ఇక జగన్ సర్కారు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లతో ఒక్కరికి అయినా ప్రయోజనం చేకూరుతుందని నిరూపిస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్ చేశారు. ఏపీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ చెప్పలేదని నిరూపిస్తే తాను ఉరేసుకుంటానని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కోనసీమ అల్లర్లు జగన్ స్పాన్సర్డ్ అల్లర్లు
కోనసీమ అల్లర్లు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పాన్సర్ చేసిన మమ్మల్ని పేర్కొన్న అచ్చెన్నాయుడు మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు తగలబడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ మోహన్ రెడ్డి దిట్ట అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకుస్థాపన చేసిన గ్రీన్ కో తో దావోస్ వెళ్లి ఒప్పందం చేసుకున్నామని చెబితే జనం నవ్వుకుంటున్నారు అంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు.

అప్పులు తెచ్చి మీట నొక్కటానికి సీఎం అవసరం లేదు
అప్పులు తెచ్చి మీట నొక్కేందుకు సీఎం అవసరం లేదంటూ అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. దీనికి ఎవరైనా ఒక వ్యక్తిని పెట్టుకుంటే సరిపోతుందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 నుండి 2019 వరకు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా ఉండేదని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలతో ఏపీ కళకళలాడేది అని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం ఏపీని విధ్వంసం చేశారని అచ్చెన్నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు . కక్ష సాధింపు పాలనతో విపక్ష నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీశారని బయటకొస్తే అక్రమ కేసులు పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వైసీపీ మంత్రులు బస్సు యాత్రను చేపట్టాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మొరిగే కుక్కలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
ఇక తెలుగుదేశం పార్టీ మహానాడు పై, తెలుగుదేశం పార్టీపై, అచ్చెన్నాయుడు పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అచ్చెన్నాయుడు కుక్కలు ఎన్నో మొరుగుతాయి అని వాటన్నిటికీ తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన కామెంట్లపై అచ్చెన్నాయుడు ఈ విధంగా స్పందించారు.

స్పీకర్ వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు కౌంటర్
ఇక మహానాడును వల్లకాడు అన్న స్పీకర్ తమ్మినేని సీతారాం కు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. తమ్మినేని సీతారాం సిద్ధంగా ఉండాలని, ఆయనను అక్కడికే పంపడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి అనుచితంగా మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం తమ జిల్లావాసి కావడంతో తాను సిగ్గుపడుతున్నానని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. టిడిపి భిక్షతో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం ఇప్పుడు టీడీపీపై ఈవిధంగా మాట్లాడటం సరికాదంటూ అచ్చెన్నాయుడు హితవు పలికారు.












Click it and Unblock the Notifications