జగన్, వైసీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అచ్చెన్నాయుడు సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రచ్చ పీక్స్ కు చేరుకుంది. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతిసవాళ్లతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. డోసు పెంచి మరీ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విరుచుకుపడుతున్నారు.

టీడీపీ ఆఫీసులపై దాడిని వదిలిపెట్టని టీడీపీ నేతలు
పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ వైసిపి కార్యకర్తలు టిడిపి నేత పట్టాభి ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి కార్యాలయాలను టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేసింది. టిడిపి అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్షకు దిగారు. ఈ వ్యవహారాన్ని ఇలా వదిలేసే ప్రసక్తే లేదని తెలుగు తమ్ముళ్ళు తేల్చి చెప్తున్నారు.

ఏపీ డ్రగ్స్ కి అడ్డాగా మారుతోంది : అచ్చెన్నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో 36 గంటల నిరసన దీక్ష మొదలు పెట్టారు. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పట్టాభి వ్యాఖ్యలను ఫోకస్ చేస్తూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారని, వైసిపి నాయకులు అంత కంటే దారుణమైన భాషను వాడారని, అయితే తాము దాడులు చేశామా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రం గా మారుతుందని ఆవేదనతో పోరాడుతుంటే దాడులకు దిగుతున్నారని అసహనం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.

డీజీపీ తీరుతో అమరులైన పోలీసుల ఆత్మ ఘోష పెడుతుంది
మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని మండిపడిన అచ్చెన్నాయుడు, రాష్ట్ర యువత ను కాపాడడం కోసం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నందుకు టిడిపి నేతలపై దాడులు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పిస్తూ డీజీపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిజిపి తీరుతో ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మఘోష పెడుతున్నారంటూ అచ్చెన్నాయుడు డీజీపీని టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెండున్నరేళ్లలో పోలీసు వ్యవస్థను డిజిపి బ్రష్టు పట్టించారు అని విమర్శించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. సీఎం, డిజిపి కలిసి కుట్ర పన్ని చంద్రబాబు నివాసం పై దాడికి యత్నించారు అని, ఇప్పుడు ఏకంగా టిడిపి కార్యాలయం పైన దాడులకు దిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతూ అరాచకం సృష్టిస్తున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమాజ చైతన్యం కోసమే చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారని పేర్కొన్న అచ్చెన్నాయుడు, రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.
Recommended Video

జగన్, వైసీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా?
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏపీలో ప్రతిపక్ష పార్టీ పై దాడులు జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇక పదే పదే టీడీపీ నేతలు మాట్లాడిన భాష అంటూ టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.జగన్, వైసీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా? చెప్పాలంటూ సవాల్ విసిరిన అచ్చెన్న వైసీపీ నేతల కంటే దారుణంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఏనాడూ మాట్లాడలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications