ఆశ్చర్యం: పగులగొట్టలేక ఏటీఎం మెషిన్ను ఎత్తుకెళ్లిన దొంగలు
అమరావతి: దొంగతనాలకు దొంగలు కొత్త పద్దతులను ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో చోరీలు మరితంగా పెరిగాయి. ఇళ్లలోకి దూరి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లే దొంగలు తాజాగా ఏటీఎం మెషిన్లనే ఎత్తుకెళ్తున్నారు. వివరాల్లోకి వెళితే బుధవారం రాత్రి కర్నాలులో జరిగిన ఏటీఎం మెషిన్ దొంగతనం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది.
జిల్లాలోని ఆదోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో ఉన్న ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలోని నగదును ఎత్తుకెళ్లేందుకు వచ్చిన దొంగలు... సులభంగా డబ్బు లభించకపోవడంతో ఇండియన్ బ్యాంక్ ఏటీఎంనే అక్కడి నుంచి ఎత్తుకెళ్లిపోయారు. దీంతో ఏటీఎం సెంటర్లో మిషన్ లేకపోవడాన్ని గుర్తించిన స్థానికులు బ్యాంకు అధికారులకు సమాచారాన్ని అందించారు.
ఆశ్చర్యానికి గురైన బ్యాంకు అధికారులు అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఏటీఎంలో రూ.5,27వేల రూపాయిలు చోరీ అయినట్లు అధికారులు గుర్తించారు. తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం దర్యాప్తు ప్రారంభించారు.
ఈ చోరి విషయమై ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు స్వీకరించిన మరుక్షణమే నాలుగు టీంలను సరిహద్దుల్లో ఉన్న అన్నిప్రాంతాలకు పంపిచామన్నారు. అయితే బొలెరో వాహనంలో ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు ప్రాధమిక సమాచారం ఉందని అన్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఆయన చెప్పారు.
ఏటీఎంను దొంగలించింది అంతరాష్ట్ర ముఠానేనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం ఇండియా వన్ మెషిన్ను కూడా దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. ముందుగానే రెక్కీ నిర్వహించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ చోరీకి సంబంధించి కీలక ఆధారాలు లభించాయని అన్నారు.