ఏటిఎం దొంగ దొరికాడు: రూ.85 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: నగరంలో వరుస ఏటిఎం దొంగతనాలతో పోలీసులకు సవాల్ విసిరిన గజదొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏటిఎంలను బాగు చేస్తాననే నెపంతో వరుసగా ఏటిఎంలలో దొంగతనానికి పాల్పడి భారీగా నగదును ఎత్తుకెళ్లిన ఘరానా దొంగను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడింది ఏటిఎం కస్టోడియనే కావడం గమనార్హం. నిందితుని దగ్గర నుంచి 85,01,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డిసిపి కాంతి రతన్ టాటా కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కూకట్పల్లి, కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ల పరిధిల్లోని హెచ్డిఎఫ్సి ఏటిఎం కేంద్రాల్లో డబ్బులు అందుబాటులో లేవంటూ అక్టోబర్ 24వ తేదీన సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ సహాయ అధికారికి ఖాతాదారుల నుంచి ఫిర్యాదు వచ్చాయి.

దీంతో స్పందించిన ఆ సంస్థ ఆపరేషన్ అసిస్టెంట్ మేనేజర్ నవీన్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టగా కూకట్ పల్లి, ప్రగతి నగర్లోని మూడు ఏటిఎం కేంద్రాల్లో రూ. 28 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించారు. తర్వాత మయూరి ఎస్టేట్ దగ్గర ఉన్న ఏటిఎంలోని 23,01,000 రూపాయలు, కెపిహెచ్బి 4ఫేస్లోని రెండు ఏటిఎం కేంద్రంలోని 14,50,000 రూపాయలు అపహరణకు గురైనట్లు వారు తమ విచారణలో తేల్చారు.

అక్టోబర్ 23న అదే సంస్థలోని కస్టోడియన్గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ రెడ్డి ఏటిఎం యంత్రాలు పనిచేయడం లేదని, వాటికి మరమ్మతులు చేయడానికి యంత్రాలకు సంబంధించిన పాస్వర్డ్లు కావాలని మరో కస్టోడియన్ రాజేశ్వర్కు ఫోన్లో కోరాడు. దీంతో అది వాస్తవమేనని నమ్మిన రాజేశ్వర్ ఆ ఏటిఎంల పాస్వర్డ్లను చంద్రశేఖర్ రెడ్డికి తెలిపాడు.
ఏటిఎంల పాస్వర్డ్లను తెలుసుకున్న నిందితుడు కెపిహెచ్బి పరిధిలోని ఐదు హెచ్డిఎఫ్సి ఏటిఎం కేంద్రాల నుంచి 65,51,500 రూపాయలను, కూకట్పల్లిలోని బాలాజీనగర్, అల్విన్ కాలనీలోని మరో రెండు ఏటిఎం కేంద్రాల నుంచి 19,50,000 రూపాయల చోరీకి పాల్పడ్డట్లు డిసిపి తెలిపారు. నగదు అపహరణకు గురైనట్లు సంస్థ అసిస్టెంట్ మేనేజర్ నవీన్ పోలీసులను ఆశ్రయించడంతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications