పెరిగిన విపక్షం గొంతు: కెసిఆర్‌పై ముప్పేట దాడి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై అన్ని వైపుల నుంచి దాడి ప్రారంభమైంది. ఇంత కాలం కొంత మెత్తగా ఉంటూ వచ్చిన ప్రతిపక్షాలు ఇప్పుడు గొంతు పెంచుతున్నాయి. వివిధ అంశాలపై కెసిఆర్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొదటి నుంచి కెసిఆర్‌పై కత్తులు నూరుతూనే ఉన్నది.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను నియమించడంపై తీవ్రంగా ధ్వజమెత్తిన బిజెపి ఆ తర్వాత కాస్తా గొంతు తగ్గించి, ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కెసిఆర్ అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నించడానికే సానియా అంశాన్ని ప్రస్తావించినట్లు బిజెపి సర్దిచెప్పుకుంది. 1956 నవంబర్ 1వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును గీటురాయిగా తీసుకుని అంతకు ముందు నుంచి తెలంగాణలో నివాసం ఉంటున్న కుటుంబాల పిల్లలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి, దాన్ని ఫాస్ట్ అనే పథకం కిందికి మార్చేసింది.

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నది. స్థానికతకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విడదీయరాని ముడి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడానికి నిరాకరిస్తోందనే ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాస రావు, రావెల కిశోర్ కుమార్ నిత్యం కెసిఆర్‌పై ధ్వజమెత్తుతున్నారు. ఈ విషయంపై వారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు.

Attack on KCR from all sides

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో బిజెపి కూడా కెసిఆర్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేస్తూ వస్తోంది. కాంగ్రెసు నాయకులు కూడా కెసిఆర్ ప్రభుత్వంపై దాడి పెంచుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరిని మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన విమర్శపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు.

తాజాగా బుధవారంనాడు కూడా జానా రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీష్ రావు వ్యాఖ్యలను తప్పు పట్టారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. హరీష్ రావు అధికార దాహంతో మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అడిగినవాటికి అడ్డంగా మాట్లాడడం సమాధానం కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీల గురించే తాము ప్రశ్నించామని ఆయన అన్నారు. ప్రభుత్వ వైఖరి మారకుంటే ప్రజలే సమాధానం చెప్తారని జానా రెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావు మాటలకు స్పందించబోనని కూడా ఆయన అన్నారు.

కాగా, కెసిఆర్ వైఖరిపై గత కొద్ది రోజులుగా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనే బిజెపి నాయకులు కెసిఆర్‌ను తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు ముడి పెట్టి వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఉస్మానియా విద్యార్థులు చేస్తున్న ఆందోళన కూడా కెసిఆర్‌పైకి గురి పెట్టిందే. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయితే, దాన్ని కెసిఆర్ గానీ, ప్రభుత్వం గానీ తీవ్రంగా తీసుకున్నట్లు లేదు.

విద్యార్థుల ఆందోళనను సమర్థించే విషయంలో ప్రతిపక్షాలు వెనకడుగు వేస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు వ్యతిరేకమవుతామనే భయం వాటికి ఉన్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెసులో ఈ విషయంలో రెండు ధోరణులు ఉన్నట్లు కనిపిస్తోంది. విద్యార్థుల ఆందోళనకు మాజీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ మద్దతు తెలపగా, ఈ విషయంలో పునరాలోచన చేస్తే బాగుంటుందని మరో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

అయితే, కెసిఆర్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తన నిర్ణయాలపై కఠినంగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి, కెసిఆర్‌ను ఇరకాటంలో పెట్టడానికి ప్రతిపక్షాలకు సరైన అస్త్రాలు దొరకడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+