టివీలొచ్చాక కలుషితం: కెసిఆర్, బాబుపై మేకపాటి ఫైర్
హైదరాబాద్: టీవిలు, సినిమాలు వచ్చాక తెలంగాణ సంస్కృతి కలుషితమైందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు. అక్టోబర్ 4 నుండి 12 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి బంగారు బతుకమ్మ సిడిని కెసిఆర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడారు.
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేరు వేరు భాషా మాండలికాలు ఉంటాయన్నారు. ప్రాంతాలను బట్టి యాస, భాష వేర్వేరుగా ఉంటుందన్నారు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని కొంతమంది కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఏ ప్రాంతంలోని మాండలికాన్నైనా గౌరవించాలని, తెలంగాణ భాషలో మాట్లాడితే వికారం కాదని, అలా ఆలోచించే వారిదే తప్పన్నారు. తెలంగాణ భాష పైన, సంస్కృతి పైన భయంకరమైన దాడి జరిగిందన్నారు.

అది ఇక్కడి వారి మనసును గాయపర్చిందన్నారు. తెలుగు సినిమాలలో హాస్యనటులకు తెలంగాణ భాషను పెడతారని, తెలంగాణలో తెలుగు, ఉర్దూ చెట్టాపట్టాల్ వేసుకుందన్నారు. తెలంగాణ సంస్కృతి పునరుద్దరణలో తెలంగాణ జాగృతిది కీలకమైన పాత్ర ఉందన్నారు.
బాబుపై మేకపాటి ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గవర్నర్ నరసింహన్ను కోరామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సబ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి శుక్రవారం అన్నారు. పార్టీ నేతలు నరసింహన్ను కలిసిన అనంతరం మేకపాటి మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ప్రజలు రాష్ట్ర సమైక్యాన్నే కోరుకుంటున్నారని తాము వివరించామన్నారు. ఒకవేళ విభజన జరిగితే హైదరాబాద్ లాంటి నగరం సీమాంధ్రలో నిర్మించుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందన్నారు.
విభజన ప్రకటన వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇవేమీ పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో తిరుగుతున్నారని ఆరోపించారు. బాబు అవినీతి గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్వుతారన్నారు. బాబుకు ఆత్మ లేదు.. గౌరవం లేదని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications