తెలంగాణ 3రోజుల్లో చెప్పకుంటే: కేసీఆర్ ఏంచెప్పినా.. సెక్షన్8 బంతి గవర్నర్ కోర్టులో
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య సెక్షన్ 8 చిచ్చు రాజుకున్న విషయం తెలిసిందే. దీని పైన కొత్త కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెక్షన్ 8 పెట్టాల్సిందేనని ఏపీ ప్రభుత్వం అంటే, అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
ఈ నేపథ్యంలో సెక్షన్ 8 పైన వివిధ రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా, మరో విషయం వెలుగులోకి వచ్చింది.
అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గవర్నర్ నరసింహన్కు సెక్షన్ 8 గురించి పలు సూచనలు చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన యాక్టులోని సెక్షన్ 8ను తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.
సెక్షన్ 8 విషయంలో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల్లో స్పందించాలని లేదంటే గవర్నర్ దానిపై తన సొంత నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ తన విచక్షణాధికారాలు ఉపయోగించవచ్చునని చెప్పారని సమాచారం. ఈ విషయంలో గవర్నర్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.
సెక్షన్ 8 గురించి తొలుత తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాలని అటార్నీ జనరల్ గవర్నర్కు సూచించారు. తెలంగాణ సీఎంను అభిప్రాయం అడగాలని చెప్పారు. మూడు రోజుల్లో సీఎం స్పందించాల్సి ఉంటుందని, ఆ తర్వాత గవర్నర్ విచక్షణాధికారాలు ఉపయోగించవచ్చునని చెప్పారని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విలువైన సూచనలు ఇస్తే, వాటిని నోటిఫికేషన్లో చేర్చవచ్చునని, తుది నిర్ణయం మాత్రం గవర్నర్ చేతిలోనే ఉంటుందని చెప్పారని సమాచారం. డ్రాఫ్ట్ గవర్నర్ సలహాదారులు తయారు చేయవలసి ఉంటుందని చెప్పారు.