జగన్పై కోర్టు ధిక్కరణకు అటార్నీ జనరల్ నో- కేంద్రం వైఖరి అదేనా ? జగన్ కోరుకున్నట్లే...
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు మరికొందరు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కలిసి తన ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు సీఎం జగన్ రాసిన లేఖపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ లేఖపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ అటార్నీ జనరల్ను కోరడం, ఆయన దీన్ని తిరస్కరించడం చకచకా జరిగిపోయాయి. అయితే అశ్వినీ ఉపాధ్యాయ లేఖకు అటార్నీ జనరల్ ఇచ్చిన సమాధానం కేంద్ర ప్రభుత్వ అభిప్రాయంగానే పరిగణించాలా లేక సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న దానిపై చర్చ సాగుతోంది. కేంద్రం అభిప్రాయం అయితే మాత్రం జగన్కు భారీ ఊరట లభించినట్లే అవుతుంది.

ఒక్క సమాధానం- వంద ప్రశ్నలు..
సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ వ్యవహారశైలిని ప్రశ్నిస్తూ ఛీఫ్ జస్టిస్ బాబ్డేకు ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా రాదా అన్న చర్చకు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నిన్న ఓ రకమైన సమాధానం ఇచ్చారు. అయితే లాయర్ అశ్వినీ ఉపాధ్యాయకు ఆయన ఇచ్చిన సమాధానంలో పేర్కొన్న పలు అంశాలు ఈ మొత్తం వ్యవహారంపై పలు కొత్త ప్రశ్నలు సైతం లేవనెత్తాయి. ఇదే లేఖలో అటార్నీ జనరల్ వేణుగోపాల్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. జగన్ లేఖ రాసిన సందర్భం అనుమానాలకు తావిస్తోందని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఛీఫ్ జస్టిస్ పరిధిలో ఉన్న ఈ అంశంపై కోర్టు ధిక్కార చర్యలకు అనుమతి ఇవ్వలేనన్నారు. ఈ స్పందనపై ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్పై కోర్టు ధిక్కరణ- కేంద్రం అభిప్రాయం అదేనా
అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ నిన్న వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం జగన్ రాసిన లేఖపై అనుమానాలు ఉన్నా, ఛీఫ్ జస్టిస్ పరిధిలోని అంశంపై తాము నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పారు. దీంతో అటార్నీ జనరల్ వ్యక్తం చేసిన అభిప్రాయం కేంద్రం అభిప్రాయమేనా లేక సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఆయన దీన్ని చెప్పారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇది కేంద్ర అభిప్రాయమే అయితే ఈ వ్యవహారం ఛీఫ్ జస్టిస్కే వదిలిపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లవుతుంది. ఛీఫ్ జస్టిస్కు లేఖ రాయడానికి రెండు రోజుల ముందు ప్రధాని మోడీతో జగన్ భేటీ కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం ఈ వ్యవహారాన్ని ఛీఫ్ జస్టిస్ కోర్టులోకి నెట్టేసి మౌనం వహిస్తుందా లేక సుప్రీంకోర్టుకు తన అభిప్రాయం నేరుగా చెబుతుందా చూడాల్సి ఉంది.

జగన్ కోరుకున్నదే జరుగుతోందా ?
సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యవహారశైలిపై సీఎం జగన్ ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖ, ఆ తర్వాత దాన్ని బహిర్గతం చేయడంతో జగన్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు అర్ధమైపోయింది. అయితే ఈ లేఖపై జగన్ కోరిన విధంగానే విచారణ జరిపించాలని ప్రముఖ న్యాయకోవిదులు ఇప్పటికే డిమాండ్లు వినిపిస్తున్నారు. మరికొందరు కోర్టు ధిక్కార చర్యలు కూడా కోరుతున్నారు. అయితే మెజారిటీ న్యాయవర్గాల నుంచి ఆరోపణలపై విచారణ జరిపిస్తేనే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు అటార్నీ జనరల్ కూడా ఛీఫ్ జస్టిస్ పరిధిలో ఉన్న అంశంపై తాము స్పందించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే కేంద్రం కూడా జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. దీంతో జగన్ కోరినట్లుగానే ఈ వ్యవహారంపై అందరూ ఛీఫ్ జస్టిస్కే వదిలిపెట్టి విచారణకు మద్దతిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఛీఫ్ జస్టిస్ మాత్రం ఇప్పటివరకూ దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు. అయినా జగన్ కోరుకున్న విధంగా జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చర్చ మాత్రం సాగిపోతోంది. ఛీఫ్ జస్టిస్ స్పందన ఆలస్యమైతే ఈ చర్చ మరింత ముదిరే అవకాశాలూ లేకపోలేదు.












Click it and Unblock the Notifications