పవన్! బుల్లెట్టా? బ్యాలెట్టా?: హేళన చేస్తారా? అంటూ అవంతి ఫైర్
విశాఖపట్నం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారడం లేదు. ఇతర పార్టీల నేతలతోపాటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పవన్ వ్యాఖ్యలపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు స్పందించగా తాజాగా, తెలుగుదేశం అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) స్పందించారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం టిడిపి ఎంపీలు ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ బ్యాలెట్ను నమ్ముతారో, బుల్లెట్ను నమ్ముతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసం పదవులకు రాజీనామా చేసేందుకు, అవసరమైతే ఆమరణ దీక్షలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా కోసం రెండు రోజులపాటు తాము పార్లమెంటును స్తంభింపజేసిన విషయం పవన్కు తెలియదా? అని ప్రశ్నించారు. తెలుగులో మాట్లాడితే ప్రధానికి, మంత్రులకు అర్థం కాదనడం సరికాదని, పార్లమెంటులో సభ్యులు ఏ ప్రాంతీయ భాషలో మాట్లాడినా.. ఇతర సభ్యులకు అర్థమయ్యేలా అనువాదం చేస్తారన్న విషయాన్ని పవన్ గుర్తించుకోవాలన్నారు.
పార్లమెంటులో తెలుగులో మాట్లాడటాన్ని హేళన చేసి తెలుగు భాషను, తెలుగు ప్రజలను ఆయన అవమానించారన్నారు. రాష్ట్రంలో ధర్నాలు చేయడం వల్ల ఉపయోగం వుండదని, ఢిల్లీలో ధర్నా చేస్తే అందరికీ తెలుస్తుందని, ఆయన వెనుకే తాముంటామని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనివారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ద్వారా ఏదీ సాధించలేరని, పార్లమెంట్కు వస్తానంటే.. తన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని, పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం కాబట్టే 'సర్' అని అంటున్నామని, దానిని కూడా విమర్శించడం తగదన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు అనునిత్యం కష్టపడుతున్నారని, దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత అనుభవశాలి, సీనియర్ అయిన అయన గత 25 నెలల్లో 23సార్లు ప్రధాని మోడీని కలిసిన విషయం పవన్ గుర్తించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తమకు ప్రత్యేక అభిమానం ఉందని, ఆయనిచ్చే సలహాలు, సూచనలు పాటిస్తామన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న పవన్.. డబ్బు గురించి మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు.

ఎంపీలు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు
ప్రత్యేక హోదాపై తమతో పవన్ కలిసి వస్తామంటే స్వాగతిస్తామని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు చెప్పారు. తెనాలిలో ఆదివారం మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం ఆయన పడుతున్న తపన సంతోషకరమని చెప్పారు.
బీజేపీకి మిత్ర పక్షం కావడం వల్లే పోరాడే విధానంలో మార్పు ఉందన్నారు. విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలను అమలు చేసేందుకు సీఎం కూడా కేంద్రంపై పదే పదే ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటిస్తుందని భావిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications