అయ్యన్న కడిగిన ముత్యమేం కాదు, బీసీ కార్డు ప్రయోగించడం సరికాదు: డిప్యూటీ సీఎం
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నర్సీపట్నంలో గల ఇంటి గోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో నకిలీ డాక్యుమెంట్లు సమర్పించారని సీఐడీ పోలీసులు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేయడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కౌంటర్ అటాక్ చేశారు.
అయ్యన్నపాత్రుడు అడ్డంగా దొరికిపోయాడని.. అందుకే అరెస్ట్ చేశారని ముత్యాలనాయుడు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారని గుర్తుచేశారు. ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని సీఐడీ ప్రాథమిక విచారణలో తేలిందని గుర్తుచేశారు. సీఎం జగన్ ఎవరినీ అన్యాయంగా అరెస్ట్ చేయించడం లేదన్నారు.
ఓటమి తప్పదనే భయంతో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ విషయంలో కులం పేరుతో సానుభూతి పొందాలని చూడటం సరికాదన్నారు. తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారని.. దానికి బీసీ కులం కార్డు ముడిపెట్టడం ఏంటి అని ముత్యాలనాయుడు ప్రశ్నించారు. నేరాన్ని బీసీలకు అంటగట్టే ప్రయత్నం అయ్యన్నపాత్రుడు చేస్తున్నాడని ఫైరయ్యారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు.
చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తే, ఓ వర్గం మీడియా తప్పుగా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మంత్రిగా పనిచేసిన అయ్యన్న వంటి వ్యక్తి ఫోర్జరీ వంటి పనులకు పాల్పడవచ్చా? అని ముత్యాలనాయుడు నిలదీశారు. అరెస్టులు అక్రమం అంటున్న టీడీపీ నేతలు అందుకు ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పించాలని కోరారు. అంతేకానీ ఊరికే ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని సూచించారు.