వైఎస్ జగన్ ను కలిసి స్టార్ షట్లర్ సిక్కిరెడ్డి!
హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత నేలకుర్తి సిక్కి రెడ్డి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్ జగన్ ను ఆమె కలుసుకోవడం ఇదే తొలిసారి. బ్యాడ్మింటన్ లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చుతున్న ఆమె కొద్దిరోజుల కిందటే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం ఆమె హైదరాాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ ను మర్యాదపూరకంగా కలిశారు. తాను సాధించిన అర్జున అవార్డును వెంట తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా జగన్ ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అకాంక్షించారు. తెలంగాణలోని కోదాడకు చెందిన సిక్కిరెడ్డి కొద్దిరోజులుగా బ్యాడ్మింటన్ రాణిస్తున్నారు. అనూహ్య విజయాలను నమోదు చేశారు. గత ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో బ్యాడ్మింటన్ డబుల్స్ లో రజత పతకాన్ని సాధించారు. అశ్విని పొన్నప్పతో కలిసి బ్యాడ్మింటన్ డబుల్స్ ఆడారు. బ్యాడ్మింటన్ లో ఆమె చూపుతున్న ప్రతిభను గుర్తించిన కేంద్రం.. అర్జున అవార్డుతో సత్కరించింది.