బద్వేల్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల-నామినేషన్ల స్వీకరణ ప్రారంభం-త్వరలో అఖిలపక్షంతో సీఈవో భేటీ
కడప జిల్లా బద్వేలులో వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఖాళీ అయిన అసెంబ్లీ స్ధానంలో ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ నెల 30న ఉపఎ న్నికల నిర్వహించేందుకు వీలుగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఇవాళ బద్వేల్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది.
బద్వేలు ఉపఎన్నిక కోసం ఇవాళ అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ నోటిపికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 8 వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలన, ఉపసంహరణ ఉంటుందని సీఈవో విజయానంద్ తెలిపారు. కోవిడ్ దృష్యా నామినేషన్ల ప్రక్రియలో కొన్నిఆంక్షలు విధించారు. నామినేషన్లు వేసేందుకు అభ్యర్ధితో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఇంటింటి ప్రచారంలోనూ ఐదుగురికి మించి పాల్గొనరాదని తెలిపారు. బహిరంగ సభల్లో వెయ్యి మందిని మాత్రమే అనుమతించనున్నారు.
బద్వేలు నోటిఫికేషన్ తో నియోజకవర్గంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని నిశితంగా పరిశీలిస్తామన్నారు. మొత్తం బద్వేల్లో 272 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని సీఈవో విజయానంద్ తెలిపారు. మరో 9 అదనపు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 30 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు.
Recommended Video
కోవిడ్ సోకిన వారు బ్యాలెట్ ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. 27వ తేదీ సాయంత్రంతో ప్రచారం ముగుస్తుందని తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఉంటుందన్నారు. గ్రామ,వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని సీఈవో ఆదేశాలు ఇచ్చారు.