ఎక్కడ?: చిన్నారి ప్రాణం కోసం ‘బాహుబలి’లోలా తండ్రి సాహసం
విశాఖపట్నం: బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ నదిలో మునిగిపోతూ అమరేంద్ర బాహుబలి(బాలుడు)ని తన చేతులతో ఎత్తి పట్టుకుంటుంది. ఈ సినిమాలోని ఈ సన్నివేశాన్ని తలపించేలా విశాఖపట్నంలో ఓ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఇది అక్కడి గిరిజనులు అవస్థలకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ ప్రజలు స్వగ్రామాల నుంచి పొరుగు గ్రామాలకు వెళ్లాలంటే సుమారు వంద మీటర్ల వెడల్పు కలిగిన వాగు దాటాల్సిందే. వర్షాకాలంలో ఈ వాగు సుమారు ఆరు నుంచి 20 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తుంటుంది.
కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుడుముసారి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఈ గ్రామ పంచాయతీకి చెందిన పాంగి సత్తెబాబు ఏడాది కుమార్తె రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తరలించే మార్గం లేక ఇంట్లో నాటు వైద్యం చేయించారు.
అయితే దాని ఫలితం లేకపోగా వ్యాధి తీవ్రమైంది. దీంతో తండ్రి సత్తెబాబు తన బిడ్డను కాపాడుకోవాలని తన బాబాయితో కలిసి చిన్నారిని అతి కష్టం మీద వాగు దాటించి లోతుగెడ్డ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యాధికారి సత్యనారాయణ చికిత్స అందించడంతో పాప ఆరోగ్యం కుదుటపడింది.
చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామానికి ఇదే విధంగా చిన్నారిని తలపై పెట్టుకుని తీసుకువెళ్లారు. సత్తెబాబు తన చిన్నారిని కాపాడుకునేందుకు చేసిన సాహసోపేతమైన ప్రయాణ చిత్రాలను అక్కడే వున్న ఉపాధ్యాయుడు పొగడాల చిన్నాబాబు తన స్మార్ట్ఫోన్లో బంధించి మీడియాకు అందజేశారు. దీంతో ఆ గిరిజనుల బాధలు అందరికీ తెలిసేలా చేసింది మీడియా. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు వారి కష్టాలను తీర్చే పనిలో పడతారని ఆశిద్దాం.