బాలకృష్ణను వాడుకోవడమేనా..: చంద్రబాబుపై ఫ్యాన్స్
విశాఖపట్నం: నందమూరి హీరో బాలకృష్ణను వాడుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని బాలకృష్ణ ఫ్యాన్స్ రాష్ట్ర సలహాదారు చల్లకొండ రమేష్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణకు ప్రధాన స్థానం కల్పించాలని ఎన్నికల సమయంలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
విశాఖపట్నం జిల్లా పాయకరావు పేటలోని నందమూరి కల్చరల్ యూత్ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ ఆంతరంగికునిగా ఇది తన ఆవేదన అని, తప్పయితే బాలయ్యే తన వ్యాఖ్యలను ఖండిస్తారని అన్నారు.

ఇప్పటికైనా పార్టీలో బాలకృష్ణ స్థానం ఏమిటో చంద్రబాబు వెల్లడించాలని రమేష్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం వెన్నంటి ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న నందమూరి అభిమానులకు రాష్ట్రవ్యాప్తంగా తీరని అన్యాయం జరుగుతోందని కూడా ఆయన అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని ఎన్నికల సమయంలో అవసరానికి వాడుకుంటూ ఆ తరువాత వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా రూపుదిద్దే క్రమంలో బాలయ్యకు తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్ష పదవి కేటాయించాలని కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆయన అభిమానులు నిరసనలకు దిగారు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నగర తెలుగుదేశం నాయకుడు పైడేటి రఘు నాయకత్వంలో ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications