సింహం సింగిల్గా..: బాలయ్య డైలాగ్, నవ్వుకున్న రోజా!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తొలి అసెంబ్లీ సమావేశాలకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలిచిన నటులు బాలకృష్ణ, రోజాలు హాజరై, ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వారు అసెంబ్లీలో అడుగుపెట్టిన సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుందట.
హీరో నందమూరి బాలకృష్ణ టిడిపి తరఫున హిందూపురం నియోజకవర్గం నుండి గెలుపొందారు. గురువారం, తొలుత ఎన్టీఆర్ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించిన బాలకృష్ణ 11.20 గంటలకు అసెంబ్లీకి ప్రాంగణంలోకి చేరుకున్నారు. బాలయ్య మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టడంతో సిబ్బంది, పోలీసులు ప్రత్యేకంగా చూశారు. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బాలకృష్ణ టీడీఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు.

ఆ తర్వాత కొద్దిసేపటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేల బస్సు అసెంబ్లీకి వచ్చింది. రెండో నెంబర్ గేటు వద్ద వారంతా జగన్ కోసం వేచి చూశారు. వారిలో ఉన్న సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాను విలేకరులు పలకరించారు.
బాలకృష్ణ కొద్దిమందితో, రోజా ఎమ్మెల్యేలతో కలిసి రావడంపై అక్కడున్న వారు సరదాగా వ్యాఖ్యానించారు. సింహం ఇప్పుడే సింగిల్గా వచ్చిందని, సివంగి గుంపుగా వస్తోందని వ్యాఖ్యానించారట. వారి వ్యాఖ్యలతో రోజాతో పాటు అక్కడున్న వారు నవ్వుకున్నారు.
కాగా, టిడిపిలో ఉండగా చంద్రగిరి నుంచి పోటీచేసి ఓడిపోయిన రోజా ఇప్పుడు నగరి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున గెలిచి అసెంబ్లీకి మొదటిసారి వచ్చారు. ఒకప్పుడు కలిసి సినిమాల్లో నటించిన బాలకృష్ణ, రోజా ఇప్పుడు ఒకేసారి అసెంబ్లీకి రావడంతో అసెంబ్లీ సినీ గ్లామర్ను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications