27 ఏళ్లకు: బాలకృష్ణ సంతోషం, అబద్దమని రఘువీరా
హైదరాబాద్: 27 ఏళ్ల తర్వాత హిందూపురం మున్సిపల్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం శుభపరిణామమని హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ గురువారం అన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కోసం హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే హోదాలో బాలకృష్ణ, పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్పలు ఓటు వేశారు. మున్సిపల్ చైర్మన్గా ఆర్ లక్ష్మి, వైస్ చైర్మన్గా జిపికె రాములు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... కౌన్సిల్ సభ్యులందరితో సమన్వయం చేసుకొని మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామన్నారు.
చంద్రబాబుపై మండిపడ్డ రఘువీరా
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడంపై ఆయన మండిపడ్డారు. శ్వేతపత్రంలో చంద్రబాబు అన్ని అబద్దాలే చెప్పారన్నారు.
బషీర్ బాగ్ కాల్పులు, విద్యుత్ ఛార్జీల పెంపు, రైతులపై కేసులు.. ఇవన్నీ శ్వేతపత్రంలో ఏవని చెప్పారు. రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చానని చెబుతున్న చంద్రబాబు తన సొంతూరులో నిరూపిస్తారా అని ప్రశ్నించారు. అది శ్వేతపత్రంలా లేదని టీడీపీ కరపత్రంలా ఉందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అబద్దాల పత్రం విడుదల చేశారని, త్వరలో తాము నిజమైన పత్రాలు విడుదల చేస్తామన్నారు.