కారంచేడులో బాలయ్య - భోగి వేడుకల్లో రోజా జబర్ధస్త్ గా : సంక్రాంతి సంబరాల్లో జోష్ తో..!!
సంక్రాంతి సంబరాల్లో సినీ ప్రముఖులు కమ్ యాక్టర్లు సండది చేస్తున్నారు. అఖండ సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య ఈ సారి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకొనేందుకు ప్రకాశం జిల్లా కారంచేడు వెళ్లారు. అక్కడ అక్కాబావలైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి కుటుంబంతో కలిసి సంక్రాంతి జరుపుకోనున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. కరోనా కారణంగా గత రెండేళ్లు వేడుకలు నామ మాత్రంగా నిర్వహించారు.
పురంధేశ్వరి నివాసంలో బాలయ్య
అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ఆహ్వానం మేరకు నారావారి పల్లెలో నారా - నందమూరి కుటుంబం కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. కానీ, ఈ సారి చంద్రబాబు కరోనా పరిస్థితుల కారణంగా నారావారి పల్లెకు రావటం లేదని వెల్లడించారు. చంద్రబాబు తన కుటుంబంతో ఈ సారి సంక్రాంతి వేడుకలకు పరిమితం కానున్నారు. ఇక, కారంచేడుకు ఇటీవల బాలకృష్ణ సతీమణి వసుంధర వచ్చినప్పటికీ.. చాలా కాలంగా బాలకృష్ణ రాలేదు. ఈ సారి బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు.
భోగి వేడుకల్లో రోజా
గ్రామస్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించలేదు. తాజాగా అఖండ సక్సెస్ తో ఊపు మీద ఉన్న బాలయ్య.. సినిమా దర్శక.. మూవీ మేకర్స్ తో కలిసి సంక్రాంతి జరుపుకున్నారు. ఇక, ప్రముఖ నటి.. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పండుగను జబర్దస్త్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు భోగి కావటంతో కుటంబ సభ్యులు.. బంధువులతో కలిసి భోగి మంటలు వేసి దాని చుట్టూ తిరుగుతూ సందడి చేసారు. తన కుమార్తె - కుమారుడి పాటుగా బంధువులు ఇందులో పాల్గొన్నారు. రోజా భోగి వేడుకల్లో పాల్గొన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రముఖుల సందడి
ముక్కోటి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి రోజా గురువారం తిరుమలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక, మంత్రులు పేర్ని నాని.. వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పండుగ శోభను సంతరించుకుంది. వీధుల్లో రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగి మంటల దగ్గర పిల్లలు, పెద్దల కేరింతలు వేస్తూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. భోగి మంటల వద్ద చిన్నారులు కోలాటలతో ఆడిపాడారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్..లోకేష్ తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.