హుధుద్ బాధితులకు బాలకృష్ణ ఫ్యాన్స్ (ఫొటో)
హైదరాబాద్: హుధుత్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ అభిమానులు ముందుకు వచ్చారు. బాలకృష్ణ స్ఫూర్తితో వారు అందుకు ముందుకు వచ్చారు. హుధుద్ తుఫాను బాధితుల సహాయార్థం రూ. 2 లక్షల డ్రాఫ్ట్ను బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు అందించారు.
బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు నంబూరి సతీష్ తమ అభిమాన నటుడు బాలకృష్ణ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆ డ్రాఫ్ట్ను అందించారు. కర్నూలు, అనంతపురం అభిమానులు చూపిన ఈ వితరణ మిగతా జిల్లాల్లోని తన అభిమానులకు మార్గదర్శం కావాలని బాలకృష్ణ అన్నారు.
ప్రతి జిల్లా నుంచి తన అభిమానులు హుధుద్ తుఫాను బాధితులకు తమ వంతు సహాయం అందించి మానవతను చాటుకోవాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. బాలకృష్ణ తుఫాను సహాయ చర్యల్లో కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రను హుధుద్ తుఫాను తాకిన విషయం కూడా విదితమే.
విజయవాడలో స్థలం
విజయవాడలో బసవతారకం ఆస్పత్రి నిర్మాణానికి స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మంగళవారం నగరంలోని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ జిల్లా టీడీపీ నేత బస్వారెడ్డిని బాబు పరామర్శించారు.
విజయవాడలోనూ ఆస్పత్రిని నిర్మించాలని ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే బాలకృష్ణను కోరినట్లు ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు. బాలకృష్ణ అందుకు ముందుకు వస్తే ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని చెప్పారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే.