మాకు తిరుగులేదు: నంద్యాలపై బాలకృష్ణ, లక్ష్మీపార్వతి నిప్పులు
నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డికి అభినం
హైదరాబాద్/అమరావతి: నంద్యాల ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం పట్ల ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
చరిత్రాత్మకం
టీడీపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధి కోసం కృషి చేస్తోన్న తమ పార్టీకి ప్రజల మద్దతు ఎప్పటికీ ఉంటుందని ఈ విజయంతో మరోసారి రుజువైందని బాలకృష్ణ అన్నారు.
ముందకు సాగాలి..
ఇదే స్ఫూర్తిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బాలకృష్ణ కోరారు. నంద్యాల ఉపఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడిన విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
హామీలు నిలబెట్టుకోని బాబు..
నంద్యాలలో జరిగింది కేవలం ఉప ఎన్నిక మాత్రమేనని, ఇవి సాధారణ ఎన్నికలు కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. ప్రభుత్వమే ఈ ఎన్నికలకు ఎక్కడా లేని ప్రచారం కల్పించిందని చెప్పారు. మూడున్నరేళ్ల పాలనలో ఎన్నడూ ఏ హామీని నిలబెట్టుకోలేదని చంద్రబాబుపై మండిపడ్డారు.
200కోట్ల ఖర్చు..
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికే హడావుడిగా భారీ ఎత్తున పనులను చేపట్టారని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలకు తాను వ్యతిరేకం కాదని, అయితే, ఇప్పటికిప్పుడు పనులను చేపట్టడాన్నే తాను ప్రశ్నిస్తున్నానని లక్ష్మీపార్వతి అన్నారు. నంద్యాల తప్ప రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికే వేరే ప్రాంతాలేవీ లేవా? అని ప్రశ్నించారు. గెలుపు కోసం టీడీపీ ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.