'బాలకృష్ణ రోడ్డు షో సక్సెస్', ఈ రోజు పేపర్ చదివా: వైయస్ జగన్
నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం తమ పార్టీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ నిర్వహించిన రోడ్డు షో సూపర్ సక్సెస్ అయ్యిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం తమ పార్టీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ నిర్వహించిన రోడ్డు షో సూపర్ సక్సెస్ అయ్యిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
చంద్రబాబు కూడా
ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు కూడా రోడ్డు షో నిర్వహిస్తారని సోమిరెడ్డి చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో జగన్ అనవసరంగా మాట్లాడుతున్నారన్నారు. 2014లో కర్నూలులో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల పనులు కొనసాగుతున్నాయన్నారు.
Recommended Video
చంద్రబాబుకు అలవాటే
మోసం చేయడంలో, కుల,మతాలను వాడుకోవడంలో చంద్రబాబు డిగ్రీలు చేశారని జగన్ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఎద్దేవా చేశారు. ఆత్మకూరు జంక్షన్లో రోడ్డు షోలో మాట్లాడారు. అబద్ధాలు ఆడి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీని నెరవేర్చలేదన్నారు.
ఈ రోజు పేపర్ చదివా
చంద్రబాబు సీఎం అయి 38 నెలలు అవుతుందని, వాడుకోవడం, తోసేయడం చంద్రబాబు నైజమని జగన్ అన్నారు. ఈ రోజు పేపర్ చదివానని, ఆ పేపర్ చంద్రబాబు ఏమన్నారో తెలుసా.. రైతు రుణాలను, పొదుపు సంఘాల రుణాలను పూర్తిగా మాఫీ చేశానని చెప్పారని, సిగ్గులేకుండా, బొంకుతా ఉంటే, ఇలాంటి వ్యక్తికా మనం ఓటు వేయాల్సింది? అని అందరినీ అడుగుతున్నానని జగన్ విమర్శించారు.
ఎన్టీఆర్ ఏమన్నారంటే
చంద్రబాబు గురించి ఆయన మామ ఎన్టీఆర్ నాడు విమర్శించిన తీరు ఏ విధంగా ఉందనే విషయాన్ని జగన్ ప్రస్తావించారు. 'ఎన్టీఆర్ గారు చంద్రబాబుగారి నైజం గురించి నాడు ఎంత చక్కగా చెప్పారంటే.. జామాతా దశమ గ్రహం అన్నారు. అసలు తొమ్మిది గ్రహాలు ఉంటాయి, ఈయన పదోగ్రహం అని అర్థం... పదవి కోసం, అధికారం కోసం ఎందుకిలా గడ్డి తింటున్నావు? అని, నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే.. తండ్రి లాంటి నన్ను ఎలా మోసం చేశాడో చూడండి అని చంద్రబాబుని ఎన్టీఆర్ నాడు అన్నారని చెప్పారు.