బాలకృష్ణ కు చంద్రబాబు కొత్త బాధ్యతలు - లోకేష్ పాదయాత్ర వేళ..!!
కుప్పం నుంచి ప్రారంభమయ్యే లోకేష్ యువగళం పాదయాత్రలో బాలకృష్ణ పాల్గొనున్నారు.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం యాత్రకు సిద్దం అవుతున్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న లోకేష్ కుప్పం బయల్దేరారు. కుప్పంలో పాదయాత్ర కమిటీలతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. యువగళం ఏర్పాట్లు సమీక్షించి నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రేపు ఉదయం 11.03 గంటలకు లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించనున్నారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభ వేళ కుప్పం కు టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర వేళ..బాలకృష్ణ కు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు.

27న ఉదయం 11.03 గంటలకు ప్రారంభం
లోకేష్ యువగళం పాదయాత్ర 27వ తేదీ ఉదయి 11.03 గంటలకు ప్రారంభం కానుంది. కుప్పంలో వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి కమతమూరు క్రాస్ వద్ద బైపాస్ రోడ్డు పక్కన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ కోసం టీడీపీ ముఖ్య నేతలతో సహా అన్ని నియోజకవర్గాల పార్టీ ఇంఛార్జ్ లు హాజరు కానున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కుప్పంకు వస్తున్నారు. మొత్తం నాలుగు వేల కిలో మీటర్ల మేర లోకేష్ పాదయాత్ర 400 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారైంది. ఈ యాత్ర ద్వారా తాను సకల జనుల గొంతునవుతానని లోకేష్ ఇప్పటికే ప్రజలకు బహిరంగ లేఖ రాసారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సారధినవుతానని లోకేష్ పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే లోకేష్ పాదయాత్ర మూడు రోజుల పాటు కొనసాగనుంది.
కుప్పం వేదికగా బాలకృష్ణ కు ప్రత్యేక బాధ్యతలు
అల్లుడు లోకేష్ పాదయాత్రలో ఈ సారి బాలయ్య ప్రత్యేక బాధ్యతలు తీసుకుంటున్నారు. చంద్రబాబు సూచనల మేరకు బాలయ్య కుప్పంలో లోకేష్ పాదయాత్రలో పాల్గొనున్నారు. లోకేష్ యాత్ర ప్రారంభం నుంచి కుప్పంలో లోకేష్ తో పాటుగా యాత్రలో కలిసి నడవనున్నారు. బాలకృష్ణ కుప్పంతో పాటుగా పలు నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్రలో పాల్గొనున్నారు. లోకేష్ హైదరాబాద్ లోని తన నివాసం నుంచి యాత్రకు బయల్దేరే సమయంలో అమ్మా, నాన్నతో పాటుగా బాలయ్య దంపతుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రాహ్మణి తిలకం దిద్ది యాత్రకు సాగనంపారు. ఆ సమయంలో నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. లోకేష్ యాత్ర సక్సస్ కావాలని ఆకాంక్షించారు.

తిరుమలలో శ్రీవారి దర్శనం..
తిరమలలో లోకేష్ శ్రీవారిని దర్శించుకున్నారు. దేవుడి కడపలో లక్ష్మీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామిని లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఆ తరువాత మరియాపురం లోని రోమన్ కేథలిక్ చర్చికి చేరుకున్న లోకేష్ ప్రార్ధనలు చేసారు. యాత్రకు సిద్దమవుతున్న వేళ..టీడీపీ శ్రేణులు లోకేష్ కు ప్రతీ చోట ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ లోకేష్ పాదయాత్ర ఇప్పుడు టీడీపీలో కీలకంగా మారుతోంది. అదే సమయంలో లోకేష్ యాత్ర వేళ వైసీపీ విమర్శల జోరు పెంచింది. ఇక..లోకేష్ తన యాత్ర ద్వారా నాడు ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర రికార్డను అధిగమించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications