సీన్లోకి బండ్ల గణేష్- నారా లోకేష్కు బెస్ట్ విషెస్..!!
యువగళం పేరుతో నారా లోకేష్ నిర్వహించ తలపెట్టిన పాదయాత్రకు గడువు సమీపిస్తోంది. ఎల్లుండి కుప్పంలో పాదయాత్రను ప్రారంభించాల్సి ఉంది. దీనికోసం కుప్పానికి బయలుదేరారు.
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్- సుదీర్ఘ పాదయాత్రకు సమాయాత్తమౌతోన్నారు. యువ గళం పేరుతో కాలినడకన రాష్ట్రాన్ని చుట్టేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకు సుమారు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారాయన. ఈ పాదయాత్ర ద్వారా 400 రోజుల పాటు ఆయన జనం మధ్యే ఉండబోతోన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది.
వచ్చే ఏడాది వరకు..
2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్.. ఈ యువ గళం పాదయాత్రను చేపట్టారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, రోడ్లు.. వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పేరుకుపోయాయని భావిస్తోన్న సమస్యలను తెలుసుకోవడానికి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు నారా లోకేష్.
27న మధ్యాహ్నం 12 గంటలకు..
ఈ నెల 27వ తేదీన నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. తన తండ్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచే తొలి అడుగు వేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు యాత్ర మొదలవుతుంది. ఇదే నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పాదయాత్ర చేస్తారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది ఆయన పాదయాత్ర.
ఆ గుడిలో పూజలు..
పాదయాత్ర ప్రారంభించడానికి ముందు కుప్పం లక్ష్మీపురంలోని శ్రీ ప్రసన్న వరదరాజస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు నారా లోకేష్. ఇదివరకు ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఈ ఆలయాన్ని సందర్శించారు. నారా కుటుంబానికి ఇది కలిసొచ్చిన ఆలయంగా చెబుతున్నారు కుప్పం టీడీపీ నాయకులు.
29 కిలోమీటర్లు..
తొలి రోజు 8.3 కిలోమీటర్ల మేర నడుస్తారాయన. రాత్రి 8 గంటలకు తొలి రోజు పాదయాత్ర ముగుస్తుంది. కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజ్ ఆవరణలో ఏర్పాటుచేసిన శిబిరంలో బస చేస్తారు. మొత్తంగా మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తారు. శాంతిపురం, గుడుపల్లి, కుప్పం, రామకుప్పంల్లో ప్రజలను ముఖాముఖి కలుసుకుంటారు. వారి సమస్యలను వింటారు. బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుమారు 29 కిలోమీటర్ల మేర ఆయన కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు.
కుప్పానికి బయలుదేరిన లోకేష్..
పాదయాత్ర కోసం నారా లోకేష్ ఈ మధ్యాహ్నం హైదరాబాద్ లోని తన నివాసం నుంచి కుప్పానికి బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు-భువనేశ్వరికి పాదాభివందనం చేశారు. వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. బ్రాహ్మణి తిలకం దిద్ది, హారతి పట్టారు. అత్తామామ బాలకృష్ణ, వసుంధర, ఇతర నందమూరి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. గుమ్మం వద్ద నారా లోకేష్ కు చంద్రబాబు ఎదురొచ్చారు. ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు.
నిర్మాత విషెస్..
కాగా- తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. లోకేష్ కు ఆయన భార్య బ్రాహ్మణి తిలకం దిద్దుతున్న ఫొటోను తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దిగ్విజయ ప్రాప్తిరస్తు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ట్వీట్ కు అసలు నువ్వు ఏ పార్టీ అన్నయ్య.. అంటూ ప్రశ్నించిన ఓ యూజర్ పశ్నించగా- దానికి బదులిచ్చారు బండ్ల గణేష్. తాను ప్రజల పార్టీ అని చెప్పారు. ప్రజలు ఏది నచ్చితే, వారికి ఎవరు నచ్చితే, అదే తన పార్టీ అని రిప్లై ఇచ్చారు.