వైసీపీ ఎంపీ నందిగం సురేష్కు అమరావతి సెగ- దాడికి విఫలయత్నం.. బైక్ అడ్డుపెట్టి రాడ్డుతో
వైసీపీకి చెందిన బాపట్ల ఎంపీ నందిగం సురేష్కు మరోసారి అమరావతి సెగ తగిలింది. మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోకపోగా.. సమర్ధిస్తున్నారనే కారణంతో ఆయనపై దాడికి ఓ వ్యక్తి ప్రయత్నించాడు. గన్మెన్లు సకాలంలో స్పందించడంతో దాడి యత్నం విఫలమైంది. స్ధానికుడు కావడం, ఎంపీగా ఉన్నా ఉద్యమానికి సహకరించడం లేదన్న కారణంతో గతంలోనూ పలుమార్లు సురేష్పై దాడులకు ప్రయత్నాలు జరిగాయి.
తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన బత్తుల పూర్ణచంద్రరావు అనే అమరావతి ఉద్యమకారుడు ఎంపీ నందిగం సురేష్ నివాసం నుంచి బయటికి వెళ్తున్న సమయంలో అక్కడికి చేరుకున్నాడు. ఎంపీ కారుకు అడ్డంగా తాను తీసుకొచ్చిన బైక్ను పెట్టాడు. అసలే చిన్న సందు కావడంతో బైక్ తీయకుండా కారు వెళ్లే పరిస్ధితి లేదు. దీంతో వ్యూహాత్మకంగా బైక్ అడ్డంపెట్టి తనతో పాటు తెచ్చుకున్న రాడ్తో ఎంపీ ఇంట్లో నుంచి బయటికి రాగానే దాడికి ప్రయత్నించాడు.

వెంటనే స్పందించిన ఎంపీ గన్మెన్లు పూర్ణచంద్రరావును అడ్డుకున్నారు. గన్మెన్లు అడ్డుకోవడంతో పూర్ణచంద్రరావు పరుగులు తీశాడు. చివరికి అతన్ని పట్టుకున్న ఎంపీ గన్మెన్లు తుళ్లూరు పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recommended Video
ఎంపీపై హత్యాయత్నం జరిగిందా కేవలం దాడేకి యత్నించాడా అన్న దానిపై పూర్ణచంద్రరావు నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గతంలోనూ ఎంపీ నందిగం సురేష్ కారును పలుమార్లు అమరావతి ఉద్యమకారుల పేరుతో కొంతమంది మహిళలు అడ్డుకున్నారు. ఆయనపై కారాలూ జల్లారు. పలుమార్లు సురేష్ దాడుల నుంచి బయటపడ్డారు.












Click it and Unblock the Notifications