బారీకేడ్ల వివాదం: షాకిచ్చిన రాజ్ భవన్, హరీష్ వివరణ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప కంచె వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇది చినికి చినికి గాలివానలా మారి గవర్నర్ - తెలంగాణ మంత్రి హరీష్ రావుల మధ్య వివాదం అన్నట్లుగా మారింది. సచివాలయంలో బారీకేడ్ల పైన హరీష్ రావు వ్యాఖ్యలు, రాజ్ భవన్ వివరణ నేపథ్యంలో హరీష్ రావు మరోసారి స్పందించారు.
రాజ్ భవన్ నుండి ప్రకటన వచ్చిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ.. ఏప్రిల్ 26వ తేదీన జీవో 426 ఇచ్చారని, దాంట్లో ఇనుపకంచె గురించి ఉన్నదని, ఏప్రిల్ 26న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నదని, గవర్నర్ పాలనలోనే ఇది జరిగిందని వివరణ ఇచ్చారు.
కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల మధ్య బారికేడ్ల ఏర్పాటు వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు భారత్, పాకిస్తాన్ దేశాలా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనపై తెలంగాణ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. బారీకేడ్లు రాష్ట్రపతి పాలన సమయంలో వచ్చాయని, గవర్నర్ నిర్ణయమని తెలిపారు.
హరీష్ రావు చేసిన ప్రకటనపై రాజభవన్ గురువారం వివరణ ఇచ్చింది. రాష్ట్రపతి పాలన సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాలను వేరు చేస్తూ బారికేడ్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగిందని మీడియాలో వార్తలు వస్తున్నాయని, రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఆ నిర్ణయం తీసుకున్నారని కూడా వార్తలు వచ్చాయని రాజభవన్ నుంచి విడుదలైన ప్రకటనలో అన్నారు. ఆ విధమైన నిర్ణయమేదీ గవర్నర్ తీసుకోలేదని, అలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేయాలని రాజభవన్ ప్రకటన స్పష్టం చేసింది.