ఏపీని భయపెడుతున్న బంగాళాఖాతం.. ఈ జిల్లాలకు వర్షసూచన!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలలో చలి తీవ్రత కొనసాగుతుందని చెబుతున్నారు.
ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన
ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలలో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు కురవగా, నేడు కూడా ఈ జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక బంగాళాఖాతంలోని తాజా పరిస్థితి నేపథ్యంలో రాగల రెండు రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావరణ కేంద్రం జారీ చేసింది.

రాయలసీమలో వర్షాలకు ఛాన్స్
ఉత్తర కోస్తా లోను, యానంలోను ఈరోజు, రేపు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇటు రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కూడా ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపు గురువారం నాడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.
దక్షిణ కోస్తాలో వర్షాలు
ఇక దక్షిణ కోస్తాలో నేటి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉంటే నిన్న రాయలసీమలో వర్షాలు కురవడంతో కొద్దిగా పూతకు వచ్చిన మామిడి తోటలు దెబ్బతిన్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత పగటివేళ ఉంటున్నట్లుగా తెలిపారు.
చలికాలంలో వర్షాలతో హడలెత్తిస్తున్న బంగాళాఖాతం
రాత్రివేళ 21 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో తాజా పరిస్థితి నేపథ్యంలో గంటకు 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రయాణాలు చేసేవారు చలిగాలులకు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బంగాళాఖాతం చలికాలంలో కూడా వర్షాలతో హడలెత్తిస్తోంది.ఇక ఒకవైపు కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కల్లకడల్ ముప్పు పొంచి ఉందని నేడు రాత్రి సముద్రంలో అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications