ఏపీలో బీసీ సంక్రాంతి సభ .. దేశ చరిత్రలోనే తొలిసారి బీసీలకు పట్టం : సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఒకపక్క రాష్ట్రంలో రాజధాని అమరావతి కోసం ఆందోళన కొనసాగుతుంటే మరోపక్క విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. బీసీ సంక్రాంతి సభకు హాజరైన సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశ చరిత్రలోనే లేని విధంగా వెనుకబడిన వర్గాలకు పదవులు ఇచ్చామని పేర్కొన్నారు. అంతేకాదు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్టు ఉందని పేర్కొన్న జగన్ ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణస్వీకారం చేశానని, రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.
బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నెముక కులాలు : సీఎం జగన్
మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని పేర్కొన్న వైయస్ జగన్, బీసీ కార్పొరేషన్లో అత్యధిక శాతం మహిళలే ఉండటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దక్కడం దేశ చరిత్రలోనే మొదటి సారి అని పేర్కొన్న జగన్, బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నెముక కులాలు అంటూ వ్యాఖ్యానించారు. 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు , డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన సభలో మాట్లాడిన సీఎం జగన్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
డిసెంబర్ 25 వ తేదీ నుంచి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్న సీఎం
రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పాలన అందుకోవాలని కార్పొరేషన్ ను ఏర్పాటు చేసినట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బీసీ కార్పొరేషన్ ల కోసం 38 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు సీఎం జగన్. డిసెంబర్ 25 వ తేదీ నుంచి ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. క్రిస్మస్ , వైకుంఠ ఏకాదశి రోజు నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ ఉంటుందని, కోర్టు ఆర్డర్ లు వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం బీసీల వెన్నెముక విరిచిందని ఆగ్రహం
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్న జగన్, ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత , ఖురాన్ , బైబిల్ పవిత్ర గ్రంథంగా భావిస్తున్నానని తెలిపారు. ఐదుగురు డిప్యూటీ సీఎం లో నలుగురు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారని పేర్కొన్న జగన్ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చామన్నారు. శాసనసభ స్పీకర్ గా బీసీకి అవకాశం ఇచ్చామని, నాలుగు రాజ్యసభ సీట్లలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బీసీల వెన్నెముక విరిచింది అని మండిపడ్డారు.