కోపం వద్దు, నాపై కుట్ర: అభిమానులకు దండం పెట్టిన పవన్, ‘ప్యాంట్లు తడిచిపోతాయ్..’
హైదరాబాద్: సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, తాజా పరిస్థితులపై చర్చించేందుకు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖులు శనివారం సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో క్యాస్టింగ్ కౌచ్, చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది.
Recommended Video
కాగా, ఈ సమావేశానికి ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారని తెలిసి భారీ సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. దీంతో వారిని కలిసేందుకు పవన్ సమావేశం నుంచి బయటికి వచ్చారు.
ప్యాంట్లు తడిచిపోతాయ్..
పవన్ కళ్యాణ్ వారిని కలిసేందుకు బయటికి రావడంతో పవన్ పవన్.. అంటూ నినాదాలతో హోరెత్తించారు అభిమానులు. నీ కోసం ఏదైనా చేస్తామంటూ అభిమానాన్ని చాటుకున్నారు. మీ అభిమానులం కాబట్టే ఇప్పటికీ శాంతియుతంగానే ఉన్నామని, లేదంటే వాళ్ల ప్యాంట్లు తడిచిపోయేవంటూ పలువురు అభిమానులు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వారితో కాసేపు మాట్లాడి, కీలక సూచనలు చేశారు. జర్నలిస్టులను ఏమీ అనవద్దని అన్నారు.
ఆడపిల్ల బట్టలు విప్పుకుంటే..
తనపై కుట్ర జరుగుతోందని పవన్ అన్నారు. ఒక ఆడ పిల్ల నడిరోడ్డుపై బట్టలు విప్పుకుని కూర్చుంటే సాధారణంగా ఎవరైనా ఆమెకు ఏదైనా వస్త్రం కప్పుతామని అన్నారు. దీనికి అభిమానులు తమ చొక్కా తీసి ఇస్తామని అన్నారు. కానీ, కొందరు మీడియా వాళ్లు మాత్రం అలా చేయలేదని అన్నారు. నటి శ్రీరెడ్డి గురించి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ ఎలా బాధ్యుడు?
అయితే, ఎవరెవరో చేసిందానికి పవన్ కళ్యాణ్ ఎలా బాధ్యుడు అవుతాడని ఆయన ప్రశ్నించారు. ఎవరూ చట్టానికి అతీతులు కాదని అన్నారు. టీవీ9 రవిప్రకాశ్తో తనకు వ్యక్తిగత సమస్యల్లేవని అన్నారు. పదే పదే తనను వివాదంలోకి లాగుతుంటే ఏం చేయాలని ప్రశ్నించారు.
చిన్నపాటి కోపం రాదా?
శుక్రవారం కేసులు కూడా పెట్టారని పవన్ చెప్పారు. పోలీసు అధికారులు వచ్చి ‘సార్ మీ పిల్లలు(అభిమానులు) కార్ల అద్దాలను పగలగొట్టారు' అని తనకు చెప్పారని పవన్ తెలిపారు. తానేమైనా గొడవ చేయమని చెప్పానా? వారెందుకు చేస్తారు? అని తాను వ్యాఖ్యానించినట్లు చెప్పారు. 8నెలల నుంచి తనను తిట్టీ తిట్టీ పోస్తున్నారని ఓ మీడియా, టీడీపీనుద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. చివరకు తన తల్లిని కూడా తిట్టి, వీధిలోకి లాగారని పవన్ అన్నారు. అయినా, చిన్నపాటి కోపం కూడా రాకూడదంటే ఎలా? అని పవన్ ప్రశ్నించారు.
సుదీర్ఘ న్యాయపోరాటం
మీడియాకు.. వాటి అధినేతలకు, అధికారులకు చెప్పండని తాను పోలీసులకు సూచించినట్లు తెలిపారు. అందరికీ కోపాలు తెప్పించి.. శాంతంగా ఉండాలంటే ఎలా అని పవన్ నిలదీశారు. అయితే, తాము కూడా ఈ విషయంలో నిస్సహాయులమేనని పోలీసులు తెలిపారని అన్నారు. సుదీర్ఘమైన న్యాయ పోరాటం చేద్దామని పవన్ తన అభిమానులతో చెప్పారు.
కోపం వద్దంటూ దండం పెట్టిన పవన్
అయితే, అభిమానులు ఎవ్వరూ కూడా కోపం తెచ్చుకోకూడదని అన్నారు. వాళ్లు తెలివిగా కుట్రలు చేస్తున్నారని అభిమానులకు చెప్పారు. తాను చెప్పే వరకూ శాంతంగా ఉండాలని పవన్ అభిమానులకు సూచించారు. న్యాయవాదులతో మాట్లాడి, లీగల్గా వెళదామని చెప్పారు. కోపం వద్దు.. తప్పు చేసింది వాళ్లైతే.. మనమెందుకు కేసులు పెట్టించుకోవాలని ప్రశ్నించారు. కోపం వద్దంటూ పవన్ తన అభిమానులకు దండం పెట్టి చెప్పారు. ఆ తర్వాత అక్కడ్నుంచి లోపలికి వెళ్లిపోయారు.