ఇదీ మీ పని తీరు, వారిని తప్పించండి : బాబుకు లగడపాటి సీక్రెట్ రిపోర్ట్, హెచ్చరిక
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవడం చర్చకు, ఊహాగానాలకు తావిచ్చింది. అయితే, చంద్రబాబు చెవిలో లగడపాటి ఏదో చెప్పారనే ప్రచారం తాజాగా సాగుతోంది.
అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల తాత్కాలిక సచివాలయంలో సీఎం చంద్రబాబును కలవడం చర్చకు, ఊహాగానాలకు తావిచ్చింది. అయితే, చంద్రబాబు చెవిలో లగడపాటి ఏదో చెప్పారనే ప్రచారం తాజాగా సాగుతోంది.
చంద్రబాబుతో లగడపాటి భేటీకి పొలిటికల్ కలర్: మీడియా కథలేనా?
తన భేటీలో రాజకీయ ప్రాధాన్యత లేదని, కేవలం వ్యాపార కార్యకలాపాల నిమిత్తమే తాను చంద్రబాబును కలిశానని లగడపాటి చెప్పారు. టిడిపి నేతలు కూడా అదే చెప్పారు. అయితే, ఆయన తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు పూర్తి నివేదిక ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.
గోప్యంగా.. 65 శాతం మంది చంద్రబాబుకు ఓకే, ఎమ్మెల్యేలపై గుర్రు
ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు లగడపాటి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఏపీ ప్రజల్లో చంద్రబాబుపై సానుకూలత ఉందని, 65 శాతం మంది ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని లగడపాటి చెప్పారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై 65 శాతం మంది ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారట.
చంద్రబాబు మాత్రమే..
రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు మాత్రమే నవ్యాంధ్రను అభివృద్ధి పట్టాలు ఎక్కించగలరని ప్రజలు నమ్మి ఆయనకు పట్టం కట్టారని ఈ సందర్భంగా లగడపాటి గుర్తు చేశారని తెలుస్తోంది. దీనిని మర్చిపోవద్దని వ్యాఖ్యానించారట.
మీతో పాటు ఎమ్మెల్యేలను చూసి ఓటేస్తారని బాబుకు హెచ్చరిక
2014లో చంద్రబాబును చూసి ప్రజలు ఓటేశారని, కానీ 2019లో మాత్రం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలను కూడా చూసి ఓటేస్తారని చంద్రబాబును లగడపాటి హెచ్చరించారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల తీరు ఇలాగే ఉంటే టిడిపికి మైనస్ అవుతుందని చెప్పారంటున్నారు. చెడ్డపేరు ఉన్న ఎమ్మెల్యేలను మార్చివేయాలని సూచించారని తెలుస్తోంది.
పునర్విభజన కూడా మార్గం
2019లో మళ్లీ టిడిపి గెలవాలంటే పునర్విభజన ఓ మార్గమని లగడపాటి.. చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 225 స్థానాలకు పెరుగుతాయి. కేంద్రంలో టిడిపితో జతకట్టిన బీజేపీ ఉన్నందువల్ల చంద్రబాబుకు అనుకూలంగా నియోజకవర్గాల పునర్విభజన చేసుకోవచ్చునని, అది టిడిపికి సానుకూలమని, నియోజకవర్గాల పెంపు కలిసి వస్తుందని చెప్పారని తెలుస్తోంది.
ఇలా వ్యతిరేకత తగ్గుతుంది
చెడ్డపేరు ఉన్న ఎమ్మెల్యేలను సాగనంపేందుకు, కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు, రిజర్వేషన్లు ఉంటాయి కాబట్టి కొంతమంది అభ్యర్థులను మార్చేందుకు వీలుండటం.. ఇలా పలు కోణాల్లో ప్రజల్లో ప్రభుత్వం, ఎమ్మెల్యేల్లో ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని లగడపాటి సూచించారని తెలుస్తోంది. 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ గెలుపుకు ఇది కూడా ఉపయోగపడిందని గుర్తు చేశారట.
రుణమాఫీపై రైతాంగం అసంతృప్తి
చంద్రబాబు ప్రవేశ పెట్టిన పలు పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉందని లగడపాటి చెప్పారని తెలుస్తోంది. అయితే, రుణమాఫీ విషయంలో మాత్రం రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉందని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది.
రాజధాని నిర్మాణంపై..
రాజధాని నిర్మాణంపై కూడా లగడపాటి విలువైన సూచనలు చేశారని అంటున్నారు. నిర్మాణం వేగవంతం కావాలని చెప్పారని తెలుస్తోంది. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నా.. 2019 ఎన్నికల నాటికి రాజధానికి ఓ రూపు రాకుంటే ప్రజలు అసంతృప్తికి లోనవుతారని చెప్పారని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, బంధువుల హల్ చల్ రిపోర్ట్
లగడపాటి రాజగోపాల్ తాజా రాజకీయ పరిస్థితులపై చంద్రబాబుకు పూర్తి నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. అందులో ఏఏ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది, ఏఏ నియోజకవర్గాల్లో ఏ ప్రజాప్రతినిధి తనయుడు లేదా బంధువులు హల్ చల్ చేస్తున్నారనే అంశాలు కూడా పొందుపర్చారని తెలుస్తోంది.
ల్యాంకో నిజం కావొచ్చు కానీ..
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబును మాజీ ఎంపీ లగడపాటి కలవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన ఎందుకు వచ్చారనే అంశంపై ఎన్నో ఊహాగానాలు వినిపించాయి. 2019 ఎన్నికల్లో విజయవాడ లోకసభ స్థానం నుంచి కేశినేని నానికి బదులు లగడపాటిని రంగంలోకి దించుతున్నారా అనే చర్చ సాగింది.
ఆ తర్వాత విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు దీనిపై స్పష్టత ఇచ్చారు. లగడపాటి వ్యాపారం నిమిత్తమే చంద్రబాబును కలిశారని చెప్పారు. అంతేకాదు, స్వయంగా లగడపాటి.. బోండాకు ఫోన్ చేసి విషయం కూడా చెప్పారని అంటున్నారు. వ్యాపార నిమిత్తం కలిసినా.. ప్రధానంగా రిపోర్ట్ గురించి కలిశారనేది తాజా వాదన.