యనమల ఎఫెక్ట్!: జగన్కు మోడీ అందుకే నో చెప్పారా?
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ దొరకలేదు. జగన్ మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసినా ప్రధాని మోడీ అపాయింట్మెంట్తో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్మెంట్ కూడా దొరకలేదు.
ఇది వైసిపికి నిరాశ కలిగించే విషయమే. ఇది వరకు జగన్ ఎప్పుడు కోరినా ప్రధాని, రాష్ట్రపతిల అపాయింట్మెంట్ సులభంగా దొరికేదనే చెప్పవచ్చు. కానీ ఈసారి మాత్రం ఆయనకు దొరకలేదు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులతో మాత్రం జగన్ భేటీ అయ్యారు.
మోడీ అపాయింట్మెంట్ దొరకక పోవడానికి తెలుగుదేశం పార్టీయే కారణమని అంటున్నారు. జగన్ కూడా ఆ అనుమానం వ్యక్తం చేశారు. టిడిపి - బిజెపిలు మిత్రపక్షాలు కాబట్టి తనకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకకపోయి ఉండవచ్చునని చెప్పారు.
అంతకుముందే, ఆయన రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులను కలిశారు. దీనిపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ చెప్పే మాటలు కేంద్రమంత్రులు సావధానంగా వినడం ఏమిటని, పైగా మిత్రపక్షమైన టిడిపిపై చెప్తున్న ఫిర్యాదులు ఆలకించడం ఏమిటని తెలుగుదేశం ప్రశ్నించింది.
ఈ విషయాన్ని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రంగానే ప్రశ్నించారని అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు తరఫున తన అభ్యంతరాన్ని కేంద్రానికి తెలియజేశారని తెలుస్తోంది. స్థానిక బిజెపి నేతలు కూడా అభ్యంతరం చెప్పి ఉంటారని అంటున్నారు. ఈ కారణాల వల్ల జగన్కు ప్రధాని అపాయింట్మెంట్ లభించకపోయి ఉండవచ్చునని అంటున్నారు.
ఢిల్లీ పర్యటనపై జగన్ ఇలా, టిడిపి అలా
తమ ఢిల్లీ పర్యటన విజయవంతమైందని, చంద్రబాబు ప్రభుత్వం అవినీతిని తాము ఢిల్లీ స్థాయికి తీసుకు వెళ్లగలిగామని వైసిపి నేతలు సంతోషపడుతున్నారు. అదే సమయంలో ఢిల్లీలో జగన్ మాటలను ఎవరూ పట్టించుకోలేదని టిడిపి నేతలు చెబుతున్నారు.