అఖిలప్రియ పావులు: అందుకే బాబుకు శిల్పా షాక్, జగన్ లెక్క ఇదీ
టిడిపి నేత శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన వైసిపిలో చేరడానికి, ప్రతిపక్ష నేత జగన్ ఆయనను ఆహ్వానించడానికి పలు కారణాలు
నంద్యాల: టిడిపి నేత శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన వైసిపిలో చేరడానికి, ప్రతిపక్ష నేత జగన్ ఆయనను ఆహ్వానించడానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు.
బాబుకు శిల్పామోహన్ షాక్: రెండ్రోజుల్లో జగన్ పార్టీలోకి, అంతా అఖిలప్రియ వల్లే!
తేల్చలేకపోతున్న చంద్రబాబు
నంద్యాల ఉప ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో టిక్కెట్ భూమా కుటుంబానికి ఇవ్వాలా లేక శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వాలా అనే విషయమై సీఎం చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే విషయమై ఆయన సర్వే చేయిస్తున్నారు. ఈ సర్వేలో శిల్పాకు, భూమా కుటుంబానికి దాదాపు సమానంగా ఫలితం వచ్చిందని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే విషయాన్ని ఇంకా తేల్చుకోలేకపోతున్నారు.
బాబు నంద్యాల సర్వేలో మరో షాక్: అఖిల ప్లాన్పై దెబ్బ, జగన్ సీరియస్
శిల్పా మోహన్ రెడ్డి అసహనం
దాదాపు రెండు మూడు నెలల క్రితమే శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడాలనుకున్నారు. కానీ సోదరుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి మధ్యవర్తిత్వం, చంద్రబాబు బుజ్జగింపుతో ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నారు. ఇన్ని రోజులయినా చంద్రబాబు ఇంకా తేల్చలేకపోవడంతో ఆయన అసహనానికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. టిక్కెట్ విషయంలోను చంద్రబాబు మదిలో ఏముందో శిల్పా ఓ అభిప్రాయానికి వచ్చారని, అందుకే ఇప్పుడే వెళ్లిపోవడం ఉత్తమమని భావించారని అంటున్నారు.
అఖిలప్రియ అడుగులు.. అందుకే పావులు
భూమా కుటుంబానికే టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు మంత్రి అఖిలప్రియకు కచ్చితమైన హామీ ఇచ్చి ఉంటారని భావిస్తున్నారు. ఆమె అడుగులు చూసినా అధినేత హామీ ఇచ్చారనే విషయం తేటతెల్లమవుతోందని అంటున్నారు. బ్రహ్మానంద రెడ్డిని నంద్యాల నుంచి నిలబెడతామని, ఏకగ్రీవం కోసం అంగీకరించాలని వైసిపి నేతలతో అఖిలప్రియ చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. విజయమ్మతోను చర్చించినట్లుగా ప్రచారం జరిగింది. జిల్లాలో ఆమె తీరు శిల్పాకు చెక్ చెప్పే విధంగా ఉన్నాయి. వీటిని గమనించిన శిల్పా.. తనకు టిక్కెట్ రావడం కల్ల అని అభిప్రాయానికి వచ్చి ఉంటారని అంటున్నారు.
ఇప్పుడు కాకున్నా.. 2019 తర్వాత అంతే
చంద్రబాబు తొలుత హామీ మేరకు భూమా కుటుంబానికి ఇస్తానని, 2019లో నీకు టిక్కెట్ ఇస్తానని శిల్పా మోహన్ రెడ్డికి ప్రారంభంలో చెప్పారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన జరిగి.. నియోజకవర్గాలు పెరిగితే తనకు అప్పుడు టిక్కెట్ వస్తుందని శిల్పా మోహన్ రెడ్డి భావించేవారు. కానీ నియోజకవర్గాల పునర్విభజన కష్టమని తేలిపోయింది. ఇప్పుడు టిక్కెట్ దక్కించుకున్న భూమా కుటుంబం 2019 వరకు పట్టు సాధించడమే కాకుండా టిక్కెట్ వదులుకునే పరిస్థితి లేదు. కాబట్టి పార్టీ మారడమే ఉత్తమమని శిల్పా మోహన్ రెడ్డి భావించారని అంటున్నారు.
సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఓకే చెప్పారా?
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ మద్దతుతో శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు మండలి చైర్మన్ ఇస్తానని చంద్రబాబు చెప్పారు. అది కూడా నెరవేరేలా కనిపించడం లేదని భావిస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు తన సోదరుడిని ఆపిన చక్రపాణి రెడ్డి ఇప్పుడు మిన్నకుండినట్లుగా తెలుస్తోంది.
ఒంటరి పోరు కంటే..
టిడిపిలో టిక్కెట్ వచ్చే పరిస్థితి లేకుంటే ఒంటరి పోరు లేదా వైసిపిలో చేరాలని శిల్పా మోహన్ రెడ్డి భావించారు. అయితే, ఒంటరి పోరు కంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితేనే గెలుపుకు అవకాశం ఉంటుందని శిల్పా మోహన్ రెడ్డి భావించడం వల్లే... జగన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
జగన్కు లాభం ఏమిటి?
శిల్పా మోహన్ రెడ్డి ఎన్నో కోణాల్లో ఆలోచించి వైసిపిలో చేరుతున్నారు. ఇక, శిల్పా తన పార్టీలో చేరితే తనకు ఏం లాభమనేది జగన్ కూడా లెక్కలు వేసుకున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం నంద్యాల ఇంచార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కంటే శిల్పానే భూమా కుటుంబాన్ని సరైన విధంగా ఎదుర్కొంటారని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి మృతి చెందినప్పటికీ, అఖిలప్రియ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ.. ఇంకా వారి క్యాడర్ భూమా ఫ్యామిలీ వెంటే ఉంది.
గుణపాఠానికి జగన్కు అవకాశం
ఇలాంటి సమయంలో తనను ఆపత్కాలంలో చేయిచ్చిన భూమా కుటుంబానికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలన్నా, ప్రతీకారం తీర్చుకోవాలన్నా శిల్పా మోహన్ రెడ్డియే సరైన అభ్యర్థి అని జగన్ భావించి ఉంటారని అంటున్నారు. రాజగోపాల్ కంటే శిల్పాకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని భావించి ఉంటారని అంటున్నారు.