సుగాలి ప్రీతికి నమ్మక ద్రోహం-పవన్ పై తల్లి షాకింగ్- సీబీఐ దర్యాప్తు డిమాండ్..!
2017లో కర్నూలులోని ఓ హాస్టల్లో అత్యాచారం, హత్యకు గురైన గిరిజన బాలిక సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆమె తల్లి పార్వతి ఇవాళ విజయవాడలో ఆరోపించారు. ప్రీతి కేసులో న్యాయం జరిపిస్తామని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదని ఆమె గుర్తుచేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. తన వంతుగా సోషల్ మీడియాలో పోరాటం చేస్తానని ఆమె ప్రకటించారు.
సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో ఆమె తల్లి పార్వతి ప్రెస్ మీట్ నిర్వహించారు. తన కూతురిని అతి కిరాయతంగా అత్యాచారం చేసి హత్య చేశారని వాపోయారు. 8సంవత్సరాలు గా న్యాయం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ ఇప్పుడు ఉపముఖ్యమంత్రి అయిన తరువాత గాలికి వదిలేశారన్నారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పై అన్నారని, 14 నెలలు ఐయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో తన కూతురు కేసుపై చర్చించాలని పార్వతి కోరారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని కోరారు. పవన్ సేనతో సేనాన్ని అంటున్నారనని, తన కూతురుకి న్యాయం చేయలేకపోయారని ఆరోపించారు. హోం మంత్రికి శ్రీకాంత్ పెరవలి పై ఉన్న దృష్టి తన కూతురు విషయంలో లేదన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఉన్న ఆత్రుత తన కూతురు విషయంలో లేదన్నారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా అని ప్రశ్నించారు.

ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని హోంమంత్రిని సుగాలి ప్రీతి తల్లి అడిగారు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ కాంపియన్ చేస్తామని తెలిపారు. నిరాహార దీక్ష కూడా చేపడతానని హెచ్చరించారు. 8 సంవత్సరాలు అవిటి తనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా అని అడిగారు. లోకేష్ రెడ్ బుక్ లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా అని ఆమె ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు, అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదని ఆమె పవన్ ను ప్రశ్నించారు. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications