విభజన సరే, ఈ రోజు అఘాయిత్యం: ఉండవల్లి, బీజేపీకి అండ.. టిడిపి రివర్స్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రవేశ పెట్టిన ప్రయివేటు మెంబర్ బిల్లు చర్చకు, ఓటింగుకు రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ ప్రభుత్వం పైన మండిపడుతున్నారు. బీజేపీ కావాలనే బిల్లును అడ్డుకుందని ఆరోపిస్తున్నారు.
రాజ్యసభలో గందరగోళం, కేవీపీకి బిజెపి షాక్: బాబుపై చిరు ఆసక్తికర వ్యాఖ్య
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ తీసిన వీడియోను పట్టుకొని బీజేపీ సభ్యులు రాద్దాంతం చేశారని, తద్వారా బిల్లును అడ్డుకునే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి ఏపీ సమస్యలు పట్టడం లేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఆ పార్టీ ఇచ్చిన మాట తప్పుతోందన్నారు. బిల్లును ప్రాంతీయ పార్టీలు అన్నీ సమర్థిస్తున్నాయని చెప్పారు.
ఉండవల్లి మాట్లాడుతూ... బిల్లు రాజ్యసభలో చర్చకు, ఓటింగుకు రాకపోవడంలో కేంద్రమే ప్రథమ ముద్దాయి అన్నారు. విభజించిన నాటి కంటే ఈ రోజు ఏపీ పైన ఎక్కువ అఘాయిత్యం జరిగిందన్నారు. చేసిన చట్టాన్ని అమలు చేయలేని దుస్థితిలో కేంద్రం ఉందన్నారు. అన్ని పార్టీలు హోదా కోసం పోరాడలన్నారు. లేదంటే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
టిడిపి మరో వాదన
ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు పైన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని టిడిపి నేత సుజనా చౌదరి అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ తప్పు చేశారని, దాని పైన చర్చకు కాంగ్రెస్ పార్టీ సహకరించలేదన్నారు. ఆ పార్టీ సహకరిస్తే ప్రయివేటు బిల్లు అరగంటలో చర్చకు వచ్చేదన్నారు. కేవీపీ ప్రవేశ పెట్టిన బిల్లు ఓ చిత్తు కాగితం అన్నారు. కాంగ్రెస్ పార్టీ చర్యవల్ల బిల్లు చర్చకు రాకుండా పోయిందని, ఆ పార్టీ పైనే నెపం వేశారు.
చంద్రబాబూ! హోదాపై అలా చేయండి: కేటీఆర్ నోట జగన్ మాట
టిడిపి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ... కీలకమైన హోదా బిల్లు ఏపీ ప్రజలకు జీవన్మరణ సమస్య అన్నారు. ఇలాంటి బిల్లు పైన కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. అంతకుముందు ఆయన సభలో మాట్లాడుతూ... ఐదు కోట్ల మంది ప్రజలు ఈ బిల్లు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ఇంత కీలకమైన బిల్లుపై ఓటింగు జరిగిన తర్వాతే ఇతర బిల్లుల పైన ఓటింగ్ పెట్టాలన్నారు.