నరేంద్రమోడీని చంద్రబాబు కాదంటారా?
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి ఫిరాయించారు. కేవలం రెండు సందర్భాల్లోనే చంద్రబాబు మోడీని కలవగలిగారు. ప్రత్యేకంగా కలవాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు మాత్రం సఫలం కావడంలేదు.

తలసానికి బాధ్యతలు?
కేంద్రంలోని మోడీ సర్కారుపై నిప్పులు చెరుగుతున్న పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. కేవలం మోడీ-షాను గద్దె దింపడమే తన లక్ష్యమని, రైతుల కోసమే తన పార్టీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటువంటి తరుణంలో ఏపీలో కూడా సాధ్యమైనన్ని ఓట్లు కొల్లగొట్టేందుకు ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అందుకు ఏపీ బాధ్యతలు చూస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది.

కేంద్రంతో సయోధ్య కోసం చంద్రబాబు
కేంద్రంపై పోరాటం చేస్తున్న కేసీఆర్ ఒకవైపు.. కేంద్రంతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరోవైపు ఉన్నారు. ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు కలవడమనేది కష్టమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో చివరి నిముషంలో ఏమైనా జరగొచ్చంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు. ఒకవేళ తమకు పూర్తి సహకారం అందించకపోయినా జగన్ కు మాత్రం తెరవెనక సహకారం అందించకుండా చూడాలనే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు.

బీఆర్ఎస్ తో కలవడం కష్టమే?
మోడీతో సయోధ్య కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చే అవకాశం లేదు. టీడీపీ, జనసేన కలిసి బీజేపీని కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రధానమంత్రి మోడీ విశాఖలో పవన్ తో మాట్లాడిన తర్వాత ఏపీ రాజకీయం మరోసార రంగు మార్చింది. ఒక్క ఛాన్స్ తనకు కూడా ఇవ్వాలంటూ పవన్ మాట్లాడుతుండటంతో పొత్తుంటుందా? లేదా? అనే సందిగ్ధం రెండు పార్టీల శ్రేణుల్లోను నెలకొంది. అయితే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తులపై త్వరలోనే ప్రకటిస్తామనడం, వ్యతిరేక ఓటును చీలనివ్వనంటూ పవన్ కల్యాణ్ సత్తెనపల్లిలో ప్రకటించడంతో మరోసారి పొత్తు రాజకీయాలు తెరపైకి వచ్చాయి. తన ప్రయత్నం తాను చేస్తున్న చంద్రబాబు కేసీఆర్ బీఆర్ఎస్ తో కలిసి వెళ్లేది సందేహాస్పదమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications