'బాబు, కేసీఆర్లను అరెస్ట్ చేయాలి', బాబుపై చర్య తీసుకోండి: ప్రణబ్కు జగన్
వరంగల్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులను అరెస్టు చేయాలని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క మంగళవారం డిమాండ్ చేశారు.
ఆయన వరంగల్ జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ, ఎంపీటీసీలను కేసీఆర్ కొన్నారని, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు భేరసారాలు చేశారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఇద్దరిని అరెస్టు చేయాలన్నారు. వీరిద్దరి అవినీతి పైన సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. నిబద్ధతతో కూడిన విచారణ జరగాలంటే ఇరువురు ముఖ్యమంత్రులను పదవుల నుండి తొలగించాలని కేంద్రాన్ని ఆయన కోరారు.
బాబును విచారించేందుకు అనుమతి అక్కర్లేదు: రామచంద్రయ్య
ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబును విచారించేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత సీ రామచంద్రయ్య అన్నారు. బాబు ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయన్నారు.
అందువల్ల ఆయనను విచారించే అధికారం తెలంగాణ ఏసీబీకి ఉందని చెప్పారు. చంద్రబాబును విచారించేందుకు తెలంగాణ ఏసీబీకి గవర్నర్ అనుమతి అవసరం లేదన్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం తనకున్న అధికారాలతో చంద్రబాబును విచారించమని గవర్నర్ ఆదేశించవచ్చన్నారు.
ప్రణబ్తో జగన్ భేటీ
వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు సహా అందరి పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.