ఎండీఎంఏ... కోస్తా నేలపై డేంజరస్ డ్రగ్... బయటపడ్డ సంచలన నిజాలు...
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డ్రగ్స్ కలకలం రేగింది. విదేశాల నుంచి డ్రగ్స్ ఆర్డర్ చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. కస్టమ్స్ అధికారులు దీనిపై దర్యాప్తు జరపగా పలు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. సాధారణంగా పట్టుబడే డ్రగ్స్ కంటే ఈ యువకుడు ఆర్డర్ చేసిన డ్రగ్ అత్యంత ప్రమాదకర డ్రగ్గా అధికారులు గుర్తించారు. వెబ్ డార్క్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేసి కోస్తాంధ్రలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
మాస్కుల పేరుతో డ్రగ్స్ దందా ... డ్రగ్స్ రాకెట్ ఛేదించే పనిలో పోలీసులు.. షాకింగ్ విషయాలు వెల్లడి
ఇలా వెలుగులోకి...
రెండు రోజుల క్రితం చెన్నై విమానాశ్రయానికి వచ్చిన పార్శిల్స్ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నెదర్లాండ్ నుంచి పశ్చిమ గోదావరిలోని భీమవరంకు వచ్చిన ఓ పార్శిల్ను పరిశీలించారు. పార్శిల్ కవర్పై టాయ్స్కు సంబంధించిన వివరాలు రాసి ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన అధికారులు దాన్ని ఓపెన్ చేసి చూశారు. లోపల ఉన్న కిడ్స్ టాయ్స్లో 400 డ్రగ్ పిల్స్ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.12లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వెంటనే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భీమవరం ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్..
పార్శిల్పై ఉన్న చిరునామా ఆధారంగా కస్టమ్స్ అధికారులు భీమవరం వచ్చి ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. సదరు యువకుడు(27)ని ఇంజనీరింగ్ విద్యార్థిగా గుర్తించారు. భీమవరంలో అరెస్ట్ చేసి చెన్నై కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. యువకుడిని విచారించిన పోలీసులు నెదర్లాండ్ నుంచి డార్క్ వెబ్ ద్వారా ఆ డ్రగ్స్ను ఆర్డర్ చేసినట్టు గుర్తించారు. డ్రగ్ను మిథైలిన్ డయాక్సీ మెథాంఫెటామైన్(MDMA)గా గుర్తించారు.
డేంజర్ డ్రగ్.. ఎండీఎంఏ
ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో పట్టుబడిన డ్రగ్స్ కేసులను పరిశీలిస్తే... ఎక్కువగా హెరాయిన్,కొకైన్,మార్ఫిన్ వంటి మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. తాజాగా ఎండీఎంఏ అనే కొత్త రకం డ్రగ్ పట్టుబడటం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై కృష్ణ ప్రశాంతి అనే ఓ సీనియర్ ఫిజీషియన్ ప్రముఖ టీవీ చానెల్తో మాట్లాడుతూ విస్తుపోయే విషయాలు వెల్లడించారు. హెరాయిన్,కొకైన్,మార్ఫిన్ వంటి డ్రగ్స్తో పోల్చితే ఎండీఎంఏ డ్రగ్ ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. ఇది మెదడు,గుండె,కాలేయంపై దుష్ప్రభావం చూపిస్తుందన్నారు. దీన్ని తీసుకునివారిలో సైకాలజికల్గా చాలా మార్పులు వస్తాయన్నారు. పళ్లు కొరకడం వంటి విపరీత చేష్టలు వారిలో కనిస్తాయన్నారు.
Recommended Video
డార్క్ వెబ్ టెక్నాలజీ ద్వారా
డార్క్ వెబ్ను ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులు,హ్యాకింగ్ టీమ్స్,అండర్ వరల్డ్ మాఫియా,చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అక్రమ సంస్థలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. దీనికి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. సాధారణ గూగుల్,యాహు సెర్చ్ వంటి వాటిల్లో ఇది ఓపెన్ అవదు. ఇందుకోసం టీఓఆర్ అనే ప్రత్యేక బ్రౌజర్ను ఉపయోగిస్తారు. వీటి ఐపీ అడ్రస్ను కనిపెట్టడం కూడా కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. చాలాసార్లు ఇది సైబర్ నిఘాకు చిక్కదని,కాబట్టి యథేచ్చగా అక్రమాలు సాగిస్తుంటారని చెబుతున్నారు. భీమవరంకు చెందిన ఓ సాధారణ ఇంజనీరింగ్ యువకుడు డార్క్ వెబ్ టెక్నాలజీతో డ్రగ్స్ ఆర్డర్ చేయడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయం అంటున్నారు. అక్కడినుంచి డ్రగ్స్ తెప్పించి కార్పోరేట్ కాలేజీల్లో డ్రగ్స్ దందాకు తెరలేపుతున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ జరిపి పూర్తి నిజాలు బయటపెట్టాలంటున్నారు.