రూ.115 కోట్లు నష్టపోయిన భోళాశంకర్ నిర్మాత
మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా నటించిన చిత్రం భోళాశంకర్. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు. తమన్నా కథానాయిక కాగా, చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. సుశాంత్, రావు రమేష్, మురళీశర్మ, రఘుబాబు, వెన్నెల కిషోర్, రవిశంకర్ తదితరులు ఇతర పాత్రలో నటించారు. మహతి స్వరసాగర్ స్వరాలందించగా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై అనిల్ సుంకర, కేఎస్ రామారావు సంయుక్తంగా నిర్మించారు.
విడుదలైన మొదటిరోజు మొదటి ఆటకే భారీ డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమాను రూ.90 నుంచి రూ.95 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొదటిరోజు రూ.28 కోట్లు వసూలు చేసింది. మరో రూ.75 కోట్లు వసూలు చేస్తేనే బ్రేక్ ఈవెన్ కు చేరుకుంటుంది. బ్రేక్ ఈవెన్ కాదుకదా.. లాంగ్ రన్ లో కనీసం రూ.10 కోట్లు వసూలు చేసే పరిస్థితి లేదని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాతో అనిల్ సుంకర రూ.60 కోట్లు నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

భోళాశంకర్ చిత్రానికి ముందు అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమాను కూడా అనిల్ సుంకర నిర్మించారు. దాని బడ్జెట్ రూ.70 కోట్లు. ఈ సినిమా కేవలం రూ.12 కోట్లు రాబట్టింది. మొత్తంగా రూ.55 కోట్లు నష్టపోయారు. భోళాశంకర్, ఏజెంట్.. ఈ రెండు సినిమాల వల్ల నిర్మాతకు రూ.115 కోట్ల నష్టం రావడంతో నిండా మునిగిపోయారు. భోళాశంకర్ శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. మరి ఈ పరిస్థితి నుంచి అనిల్ సుంకర ఎలా బయటపడతారో చూడాలి. ఎందుకంటే.. చిరంజీవితో మరో సినిమాను త్వరలోనే నిర్మించి విమర్శలకు సమాధానం చెబుతానన్నారు.












Click it and Unblock the Notifications