శిల్పామోహన్ తీరు బాగాలేదు: చంద్రబాబుకు భూమా ఫిర్యాదు, ‘సాక్షిపై క్రిమినల్ కేసు ’
విజయవాడ: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి వైఖరి తమకు ఇబ్బందికరంగా మారిందని, ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమాతో కలిసి క్యాంపు కార్యాలయానికి వచ్చిన భూమా నాగిరెడ్డి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి ఫిర్యాదు చేశారు.
కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన హత్యాయత్నాలకు, తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, భూమా కుటుంబం టీడీపీలో చేరిన తర్వాత జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు మరోమారు తలెత్తిన సంగతి తెలిసిందే.
ఇటీవల శిల్పామోహన్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం కూడా జరిగింది. కాగా, మరోవైపు శిల్పా మోహన్ రెడ్డి సైతం ఇప్పటికే భూమాపై చంద్రబాబు వద్ద ఫిర్యాదు చేశారు. తమను టీడీపీ నుంచి వెళ్లగొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
సాక్షిపై క్రిమినల్ కేసు, భూస్థాపితమే: లింగారెడ్డి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న 'సాక్షి' దినపత్రికపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లెల లింగారెడ్డి సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీఎస్ఓ)ని లింగారెడ్డి బెదిరించినట్లు 'సాక్షి' పత్రికలో ఓ వార్త ప్రచురితమైంది. దీనిపై సోమవారం హైదరాబాదులోని సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన లింగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పరిటాల రవి హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా ఉన్న వ్యక్తి రేషన్ దుకాణం నిర్వహిస్తుండటమే గాక అక్రమాలకు పాల్పడుతున్న విషయంపై డీఎస్ఓను వివరణ అడిగానని లింగారెడ్డి తెలిపారు.
అయితే డీఎస్ఓను తాను దూషించలేదని లింగారెడ్డి చెప్పారు. వాస్తవాలకు విరుద్ధంగా 'సాక్షి' దినపత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని ఆయన మండిపడ్డారు. డీఎస్ఓను తాను దూషించినట్లు నిరూపించలేకపోతే 'సాక్షి' పత్రికపై క్రిమినల్ కేసు వేస్తానని ఆయన చెప్పారు. తాను, టిడిపి కార్యకర్తలు తలుచుకుంటే సాక్షి భూస్థాపితమవుతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications