కేసుల ఎత్తివేత: చంద్రబాబు బామ్మర్దికేనా, భూమాకు వర్తించదా?
అమరావతి: ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం గతంలో టీడీపీ నేతలపై ఉన్న కేసులను ఎత్తివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బాలకృష్ణ, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఏడేళ్ల క్రితం (2009)లో నరసరావుపేటలో నమోదైన కేసులో విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళితే 2009లో జరిగిన స్వార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోడెల శివప్రసాదరావుకు మద్దతుగా ప్రచారం చేసేందుకు బాలకృష్ణ వచ్చారు. ఆ సమయంలో నరసరావుపేటలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. నిబంధనలను అతిక్రమించి ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించినందుకు బాలకృష్ణతోపాటు కోడెల, ఆయన కుమారుడు శివరామకృష్ణ, మోదుగుల వేణుగోపాల్ తదితర 15 మందిపై కేసు నమోదైంది.
ఇటీవల ఈ కేసులో వీరిపై ప్రాసిక్యూషన్ను విత్డ్రా చేసుకోవాలని రాష్ట్ర డీజీపీ సాంబశివరావు ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.ఆర్.అనూరాధ జీవో నంబరు 122ను జారీచేశారు. ఈ కేసుల ఎత్తివేతను చూసిన ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూడా సీఎం చంద్రబాబుకు దరఖాస్తు పెట్టుకున్నారు.
నాపై రౌడీషీట్ ఎత్తేయండి!: బాబుకు భూమా నాగిరెడ్డి, ఏం జరిగిందంటే..
రౌడీ షీటర్గా ఉన్న భూమా తనపై రౌడీషీట్ను ఎత్తివేయాలని స్వయంగా సీఎం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. భూమా విజ్ఞప్తి మేరకు రౌడీ షీట్ ఎత్తివేతపై నివేదిక ఇవ్వాలని కర్నూలు జిల్లా పోలీసులను చంద్రబాబు ఆదేశించారు. అసలు భూమాపై రౌడీ షీట్ తెరిచింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే కావడం గమనార్హం.
2014 అక్టోబర్ 31న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించగా భూమా మాట్లాడుతున్న సమయంలో చైర్పర్సన్ ఇక చాలించాలంటూ బెల్ కొట్టారు. దీంతో భూమా ఆగ్రహానికి లోనయ్యారు. టీడీపీ కౌన్సిలర్లకు, భూమా వర్గీయులకు మధ్య గొడవ జరిగింది.
సమావేశం ముగిసిన తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ విజయకుమార్పై హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం వెనుక భూమా హస్తముందని స్వయంగా టీడీపీ నేతలే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేవారు. దీంతో భూమాపై నాన్బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అనంతరం పోలీసులు భూమానాగిరెడ్డిపై రౌడీ షీట్ తెరిచారు.
ఇప్పుడు ఆ రౌడీషీట్ను ఎత్తివేసేందుకు తిరిగి టీడీపీ ప్రభుత్వమే సిద్దమవుతోంది. ఈ పరిణామాలపై కర్నూలు జిల్లా టీడీపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రౌడీగా కనిపించిన భూమా టీడీపీలో చేరడంతో మంచివాడు అయ్యాడా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
భూమాపై కేసును ఎత్తివేస్తే అధికారంలో ఉన్న పార్టీలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని అంటున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బామ్మర్ధి బాలకృష్ణపై కేసులు ఎత్తివేసిన చంద్రబాబు ప్రభుత్వం భూమాపై కేసులు ఎందుకు ఎత్తివేయదంటూ ఆయన వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.